తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏలా మారుతాయోనని దేశం యావత్తూ ఎదురుచూస్తోంది. కమల్ హాసన్ ఇప్పటికే పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు.
శివాజీ గణేశన్ స్మారక మండపం ప్రారంభోత్సవం చెన్నైలో ఘనంగా జరిగింది. ఉప ముఖ్యమంత్ర పన్నీరు సెల్వం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనిపించగానే పలకరించుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ఎడమొహం, పెడమొహంగానే ఉండిపోయారు.
అయితే రాజకీయాలకు సంబంధించి రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే స్టార్డమ్, మంచిపేరు, డబ్బు మాత్రమే ఉంటే సరిపోవన్నారు. వీటన్నిటికీ మించినదేదో అవసరమన్నారు. శివాజీ గణేశన్ తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిన విషయాన్ని రజనీకాంత్ గుర్తు చేశారు. దీన్నిబట్టి పేరు, డబ్బు మాత్రమే రాజకీయాల్లో రాణించడానికి సరిపోవని .. అలా రాణించాలంటే ఏం కావాలో ప్రజలకు బాగా తెలుసన్నారు.
రాజకీయాల్లో రాణించాలంటే ఏం కావాలో కమల్ కు తెలుసని తాను అనుకుంటున్నట్టు రజనీ కాంత్ అన్నారు. రాజకీయ రంగప్రవేశం చేస్తున్నందున ఇలాంటివాటిపై అవగాహన ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కమల్ “నువ్ నాతో రా.. నేను నీకు వివరంగా చేప్తా..” అంటారని రజనీకాంత్ ఛలోక్తులు విసిరారు. దీంతో సభికులంతా చపట్లు కొట్టారు.
ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. అంతేకాక.. రజనీని తనతో కలసి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే దీనిపై రజనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు ఒకే వేదికపై ఆశీనులు కావడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. అయితే రజనీ ఎలాంటి కామెంట్స్ చేయకుండా రాజకీయాల్లో రాణించాలంటే ఏంకావాలో సింపుల్ గా చెప్పేసి వెళ్లిపోయారు.