వి.హనుమంతరావు పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, విమర్శలు ఎదుర్కోవడంలో కూడా ముందుంటారు. తాజాగా ఆంధ్రోళ్లపై మరోసారి నోరు జారి విమర్శల పాలయ్యారు. ఇంతకూ వీహెచ్ ఏమన్నారో తెలుసా..?
ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను వ్యతిరేకిస్తూ వీహెచ్ పెద్ద ఉద్యమమే చేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో గరగపర్రు ఘటనపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తాజాగా ఆంధ్రోళ్లపై ఓ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. హైదరాబాద్ లో దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.
ఆంధ్రోళ్లు ఓసారి తిట్టుకున్నా, కొట్టుకున్నా ఆ తర్వాత మొహం చూసుకోరని, తెలంగాణ వాళ్లు మాత్రం కలిసిపోతారని చెప్పుకొచ్చారు. ఆంధ్రావాళ్లు గొడవ పడితే చచ్చినా వారి మొహం చూడరన్నారు. తెలంగాణ వాళ్లు మాత్రం కొట్టుకున్నా ఆ తర్వాత అలయ్ బలయ్ చేసుకుంటామని కొనియాడారు.
వీహెచ్ వ్యాఖ్యలపై పలువురు ఆంధ్రావాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రావాళ్లను కించపరుస్తూ వీహెచ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీహెచ్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆయన ఏదేదో వాగుతూ ఉంటారని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.