మనవడు దేవాన్ష్ గుర్తొస్తున్నాడని, అయినా క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సార్లు చెప్పారు. మనవడేమో హైదరాబాద్ లో ఉంటే తానేమో అమరావతిలో ఉంటున్నానని.. దేవాన్ష్ ను చాలా మిస్ అవుతున్నానని చెప్పేవారు. అయితే దసరా సందర్భంగా మనవడితోనే ఎక్కువగా గడిపి.. చంద్రబాబు మనవడి ముచ్చట తీర్చుకుంటున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఇప్పుడు అమరావతిలో హల్ చల్ చేస్తున్నారు. దసరా రోజు ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మను చంద్రబాబు కుటుంబం దర్శించుకుంది. కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మిణి, మనవడు దేవాన్ష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పట్టు పంచె, లాల్చీతో దర్శనమిచ్చిన దేవాన్ష్ ను చంద్రబాబు వేలు పట్టి నడిపించారు. ఆలయ అధికారులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను కూడా దేవాన్ష్.. చంద్రబాబు ఒడిలోనే కూర్చుని అందుకున్నారు.
అక్టోబర్ 2న స్వచ్ఛతే సేవ కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా చంద్రబాబు దేవాన్ష్ ను వెంట పెట్టుకుని వచ్చారు. ఇక్కడ కూడా బుడిబుడి అడుగులు వేస్తూ దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. గాంధీకి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం వేదికపై సీఎం ఆసీనులయ్యారు. మనవడిని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. నారా లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొత్తానికి చంద్రబాబు మనవడి ముచ్చట తీర్చుకుంటున్నారు. మూడ్రోజులుగా లోకేశ్ ఫ్యామిలీ అమరావతిలోనే ఉంటోంది. దీంతో చంద్రబాబుకు కూడా ఫ్యామిలీతో గడిపేందుకు కాస్త వెసులుబాటు చిక్కింది. ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కువగా దేవాన్ష్ తోనే గడుపుతున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాలకు కూడా దేవాన్ష్ ను తీసుకొస్తున్నారు. దేవాన్ష్ కూడా తాతయ్యతో బాగా కలసిపోయారు. చంద్రబాబు వేలు వదలట్లేదు.