ఆయన ఏది పట్టినా బంగారమే ! వ్యాపారమైనా వ్యవహారమైనా ! పచ్చళ్ళ తయారీ నుంచి ప్రపంచస్థాయి ఫిలింసిటీ వరకు ఎదిగిన ఆయన విజయం వెనుక ఉన్నది మాత్రం ఈనాడు అనడంలో సందేహం లేదు. ఆయన గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనే మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత సీహెచ్.రామోజీరావు. 1974 లో ఈనాడు ఏర్పాటు అయినప్పటినుంచి క్రమక్రమంగా ఆ పత్రిక వృద్ధి చెందుతూ వచ్చింది. కొన్నేళ్లలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికీ సర్క్యూలేషన్ పరంగా తెలుగులో ఈనాడుదే ప్రథమ స్థానం.
అలాంటి ఈనాడు ఇప్పుడు వెబ్ సైట్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతి కన్నా వెనుకపడిపోయింది. అలెక్సా ర్యాంక్ ప్రకారం ఆంధ్రజ్యోతి వెబ్ ఫార్మాట్లో ఈనాడును దాటేసింది. తెలుగు మీడియాను ఎన్నో రకాలుగా కొత్త పుంతలు తొక్కించిన రామోజీకి ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోన్న వెబ్ జర్నలిజం ఫార్మాట్లో తన ఈనాడు వెబ్సైట్ వెనకపడడం ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్టు తెలుస్తోంది.
ఇదే విషయం మీద ఇప్పుడు ఈనాడు సంస్థల అధినేత రామోజీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈనాడు వెబ్ సైట్ ని జనంలోకి ఇంకా ఉన్నత ప్రమాణాలతో తీసుకెళ్లే విషయంపై శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ విషయం మీద ప్రస్తుతం ఈనాడులో చర్చల మీద చర్చలు, ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. సర్క్యులేషన్ విషయంలో ఈనాడుతో పోల్చుకుంటే ఆంధ్రజ్యోతికి సగం సర్య్కులేషన్ కూడా లేదు. కానీ వెబ్ ఫార్మాట్లో మాత్రం ఆంధ్రజ్యోతి దూసుకుపోతోంది.
ఆంధ్రజ్యోతి వెబ్సైట్కు పాఠకుల ఆదరణ అనూహ్యంగా రోజు రోజుకు పెరుగుతోంది. ఇక ఈనాడు వెబ్సైట్ వెనకపడడంపై ఇటీవల ఆ సైట్ను రన్ చేస్తోన్న టీంకు ఏకంగా రామోజీయే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈనాడు వెబ్సైట్ను తెలుగులో టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లాలని ఇప్పుడు ఈనాడు మేనేజ్మెంట్ కంకణం కట్టుకోవడంతో పాటు అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. ఇక ఫ్యూచర్లో ప్రింట్ కన్నా ఆన్లైన్ వార్తలకే ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో రామోజీ తన మార్క్ మీడియా తెలివితేటలకు పదును పెట్టనున్నారు. మరి ఈ మీడియా మొఘల్ ఈ విషయంలో మళ్లీ ఈనాడును టాప్ పొజిషన్కు ఎంత వరకు తీసుకు వెళతారో ? చూడాలి.