మీడియా అంటే ఒకప్పుడు వార్తలకే పరిమితమై వార్తల కోసమే పనిచేసిన మాధ్యమం. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. మీడియా ఒక అండ, మీడియా ఒక మద్దతుదారు. మీడియా ఒక పరోక్ష కరపత్రం! అధికారంలో ఉండే వారు తప్పనిసరిగా మీడియాకు అనుకూలంగా అయినా మారాల్సి వస్తోంది. లేదా మీడియా అయినా వారికి అనుకూలంగా మారాల్సిన పరిస్థితి అయినా ఏర్పడుతోంది. దీంతో ఉభయకుశలోపరి అన్నట్టుగా రెండు పక్షాలూ ప్రయోజనంలో మునిగి తేలుతున్నాయి.
రాష్ట్ర విభజన సమయంలో అనేక పత్రికలు, టీవీ ఛానెళ్లు విభజన సెంటిమెంటును రాజేస్తూ.. తెలుగు నాట పుట్టుకొచ్చాయి. ఇక, ఇప్పుడు కూడా కొన్ని ఛానెళ్లు, పత్రికలు తెలుగు రాష్ట్రాల్లో ఊపిరి పోసుకునేందుకు రెడీగా ఉన్నాయి. 2019 ఎన్నికలు సంచలనంగా మారుతుండడంతో మీడియాను వ్యాపార మయం చేసేందుకు కొందరు ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మహా టీవీ కొనుగోలు విషయం దీనిలో భాగమే. ఇక టాప్ స్లాట్ వున్న మరికొన్ని ఛానెల్స్ కూడా త్వరలో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక స్టూడియోలు నిర్వహించబోతున్నాయి.
కొత్తగా పుట్టుకొస్తున్న ఛానెల్స్ వెనుక కొన్ని రాజకీయ పార్టీల నేతలు వున్నారని వార్తలు వస్తున్నాయి. దినపత్రికలు కూడా మొదలు కాబోతున్నాయి. ఉమ్మడి ఏపీలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో నడిచిన ఆంధ్ర పత్రిక కొన్నేళ్లుగా మూతపడింది. అయితే, దీనిని మళ్లీ ప్రజల్లోకి తెచ్చేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.
వెంకయ్య కేంద్రమంత్రి గా ఉండగా ఏపీ కి ప్రత్యేక హోదా అంశంలో పవన్ ఆయన మీద చేసిన విమర్శలు, దానికి కౌంటర్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్యాకేజ్ వల్ల ఎన్ని లాభాలో చెప్పిన వెంకయ్య… ఇలాంటి విషయాలు ఇంకా జనం మదినుంచి చెరిగిపోకముందే వెంకయ్య కుమార్తె, పవన్ కళ్యాణ్ ఓ పత్రిక వెనుక వున్నారనడం చిత్రంగా అనిపిస్తోంది.
ఇక తెలంగాణాలో రాబోయే ఇంకో డైలీ వెనుక ఒకప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక నడిపించిన సి.ఎల్. రాజం పేరు వినిపిస్తోంది. టీఆర్ ఎస్ నుంచి రాజ్య సభ సీటును ఆశించిన రాజం.. అది రాకపోయే సరికి నమస్తేలో సీటు ఖాళీ చేశారు. దీంతో ఇప్పుడు మరో పత్రిక తేవాలనుకుంటున్నారట. అటు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇదే ఆలోచనతో వున్నారు. దీంతో ఈ ఇద్దరూ కలిసి ఒకే పత్రిక బయటికి తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో.. ఇలా తెలుగు లోగిళ్లలో కొత్త చానెళ్లు వస్తుండడం వింత కాకపోయినా.. వాటి వెనుక ఉన్న భాగస్వాములే విచిత్రం కలిగిస్తున్నారు.