తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోయింది. ఈ ఎన్నికలకు ముందు కేసీఆర్ సదరు సింగరేణి డివిజన్లు ఉన్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి నియోజకవర్గాల్లో అయితే ఫలితాలు తేడాగా ఉంటాయో వాళ్లకు 2019 ఎన్నికల్లో టిక్కెట్లపై ఆ ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. దీంతో సింగరేణి డివిజన్లు ఉన్న అన్ని ఏరియాల్లో ఎమ్మెల్యేలు బాగా కష్టపడి అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఆయా డివిజన్లు ఉన్న అన్ని నియోజవర్గాల ఎమ్మెల్యేలకు మంచి మార్కులే తెచ్చినా ఓ ఎమ్మెల్యేకు మాత్రం పెద్ద షాక్ ఇచ్చాయి. సదరు నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఓడిపోయింది. దీంతో ఆ ఎమ్మెల్యేపై కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న చెన్నూరు నియోజకవర్గంలోని మంద్రమర్రి డివిజన్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓడిపోయింది.
ఇక్కడ ఓటమికి ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పనితీరే కారణమని కేసీఆర్కు ఇప్పటికే రిపోర్ట్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఓదేలు వర్గం వాదన మాత్రం మరోలా ఉంది. ఓదేలును నియోజకవర్గంలో అప్రతిష్టపాలు చేసేందుకే ఇలా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లలో విజయం సాధించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దించారు. శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో గెలిచిన టీఆర్ఎస్ అనుబంధ సంఘం ఓదేలు సొంత ఊరు అయిన మందమర్రిలో మాత్రం ఓడిపోయింది.
కుట్ర వెనక ఎంపీ అంటూ అనుమానాలు...
ఇక మందమర్రిలో టీఆర్ఎస్ అనుబంధం విభాగం ఓటమి వెనక ఎంపీ బాల్క సుమన్ హస్తం ఉందని ఓదేలు వర్గం అనుమానిస్తోంది. బాల్క సుమన్కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని, పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ను మాజీ ఎంపీ వివేక్ తన్నుకుపోతాడన్న ప్రచారం జరుగుతోంది. దీంతో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటోన్న సుమన్, మాజీ ఎంపీ వినోద్తో కలిసి కుట్ర చేసి ఇక్కడ అధికార పార్టీ అనుబంధ విభాగం ఓడిపోవడానికి ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ వచ్చే ఎన్నికల్లో రాదని డిసైడ్ అయిన ఎంపీ సుమన్ కొద్ది రోజులుగా చెన్నూరుపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి ఓదేలు చెక్ పెడుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు సింగరేణి ఎన్నికలను వాడుకుని వివేక్, సుమన్ ఒక్కటై ఓదేలుకు దెబ్బ వేసినట్టు చర్చలు నడుస్తున్నాయి. వారిద్దరి పొలిటికల్ ఫ్యూచర్ కోసం తనను బలిపశువును చేశారని ఓదేలు కేసీఆర్కు వివరణ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. మరి కేసీఆర్ ఓదేలుకు షాక్ ఇస్తారా ? లేదా కరుణిస్తారా ? అన్నది చూడాలి.