ఏపీలో విపక్ష వైసీపీని ఇప్పుడు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీపై నమ్మకం ప్రజల్లోనే కాదు పార్టీ ఎమ్మెల్యేల్లోనే సడలింది. దీంతో వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. పార్టీ మారే ఎమ్మెల్యేల లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
ఇదిలా ఉంటే రెండు రోజులుగా కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి పార్టీ మారుతున్నారంటూ ఒక్కటే వార్తలు జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో ఈ వార్తలకు లెక్కేలేదు. వీరు పార్టీ మారుతున్నారన్న వార్తలతో అలెర్ట్ అయిన జగన్ వాళ్లతో రెండు రోజుల క్రిందటే ఫోన్లో మాట్లాడినట్టు టాక్.
ఇక తాజాగా శనివారం రాత్రి జగన్ వీళ్లతో లోటస్పాండ్లో సీక్రెట్గా మీట్ అయ్యారు. కర్నూలు జిల్లా వైసీపీ నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో పాటు ఎంపీ బుట్టా రేణుకతో జగన్ దాదాపు గంటకు పైగా తాజా రాజకీయ స్థితిగతులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఎంపీ బుట్టా రేణుకతో పాటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జగన్ మీరు పార్టీ మారుతున్నట్టు పదే పదే వార్తలు వస్తున్నాయని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని నేతలకు జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే వీరిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయంపై కాస్త సీరియస్గానే జగన్ వద్ద గళమెత్తినట్టు టాక్. తమను నియోజకవర్గంలో గెలిపించిన కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని ఓ ఎమ్మెల్యే చెప్పడంతో జగన్ నిర్ఘాంతపోయినట్టు సమాచారం.
అంతే కాకుండా సదరు ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గంలో అస్సలు అభివృద్ధి లేదని, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని, తనపై పార్టీ మారాలని పార్టీ కార్యకర్తల నుంచే ఒత్తిడి ఉందన్న విషయాన్ని జగన్కు చెప్పడంతో జగన్ నోట మాట రాలేదట. సదరు ఎమ్మెల్యేకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి ప్రయారిటీ ఇస్తానని, కాస్త ఓపిక పట్టాలని జగన్ సర్దిచెప్పారట. మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటానని జగన్ వీరిని బుజ్జగించినట్టు మ్యాటర్ అక్కడున్న మీడియా వర్గాల ద్వారా బయటకు వచ్చింది. ఈ మీటింగ్ ఎలా ఉన్నా వీరిలో ఒకరిద్దరు మాత్రం త్వరలోనే పార్టీ కండువా మార్చేందుకు రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది.