రఘురాం రాజన్ భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్ర స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. గ్రామీణ భారతం లో నేడు బ్యాంకు శాఖల ఏర్పాటు ఆయన వల్లే సాధ్యమైంది. అంతే కాదు ప్రతి పౌరునికి ముఖ్యంగా ప్రతి పేదవానికి బాంక్ ఖాతా ఉండాలని ఆయన తపించటమే అందుకు సాక్ష్యం. ఇంతకు ముందు పనిచేసిన భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ లలో అతి కొద్ది మంది మాత్రమే రఘురాం రాజన్ స్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించారు.
మరి ఇంతటి ఆర్థిక శక్తిని భారత్ ఎందుకు పోగొట్టుకున్నది? అన్నదానిపై ఎంతగా చర్చించినా అది సమాధానం దొరకని ప్రశ్నగానే భావిస్తున్నారు. ఇదే విషయాన్ని నిష్కర్ష గా వెల్లడించారు రిచర్డ్ థాలెర్. రఘురాం రాజన్ వంటి అద్భుత ఆర్థిక నిపుణుడు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశానికి లభించడం దైవికం అనే స్థాయిలో కామెంట్లు చేశారు.
"నేడు రాజన్ కు నోబెల్ బహుమతి రాలేదు కాని, భవిష్యత్తు మాత్రం ఆయనకు నోబెల్ పురస్కారం అందించి తీరుతుంది" అని కూడా థాలెర్ స్పందించారు. రఘురాం తిరిగి అధ్యాపక వృత్తిలోకి రావటం తనకెంతో సంతోషంగా ఉందని అంటూనే, "ఆయన్ను వదులు కోని భారత్ నష్టపోయింది" అని చెప్పారు. గతంలో కూడా ఇదే స్కూల్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే ఉన్న రఘురాం రాజన్ ను, అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆర్బిఐ గవర్నర్ గా నియమించగా, అక్కడ మూడేళ్ల పాటు సెలవు తీసుకుని, ఇండియా కు వచ్చారు. ఆయన మూడేళ్ళ పదవీ కాలం పూర్తి కావడంతో రాజన్ ను కొనసాగించేందుకు భారత ప్రధాని మోదీ అంగీకరించలేదు. దీంతో ఆయన తిరిగి తన తొలి స్థానానికి అంటే ప్రొఫెసర్ గా వెళ్లిపోయారు.
భారత్ ఆర్థిక విషయాలపై ఒక సారి స్పందించిన రఘురాం రాజన్, ".. ప్రభుత్వం చేసిన పెద్ద నోట్లు రద్దు ను తీవ్రమైన చర్యగ అభివర్ణించారు. భారత ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా గాడిన పడే సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే అభివృద్ది కుంటు పడుతుందని అది దేశానికి మంచిది కాదని" ఆయన చెప్పడం కూడా ఆర్థిక నిపుణులను ఆలోచనల్లో పడేసింది.