వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. మిగిలిన పార్టీలతో పోల్చితే ఎన్నికల రేసులో ముందుంటున్నారు. పాదయాత్రకు షెడ్యూల్ ఖరారు చేశారు. అనంతపురంలో యువభేరి మోగించారు. యువత నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో జగన్ కూడా ఖుషీగా ఉన్నారు. అయితే జగన్ అక్కడ ఆ మీటింగ్ పెట్టడం వెనుక మరేదో కారణముందని భావిస్తున్నారు విశ్లేషకులు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం బలంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఆ పార్టీని ఆ పార్టీని దెబ్బకొట్టే మొనగాడెవడూ లేడన్నది విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ కూడా అంతే ధీమాతో ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు సునాయాసమేనని అంచనా వేస్తోంది. తాము చేపట్టిన సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని చంద్రబాబు గట్టి ధీమాతో ఉన్నారు.
మరోవైపు వైసీపీ అధికారంకోసం ఆపసోపాలు పడుతోంది. పార్టీ తరపున గెలిచినవాళ్లు గోడ దూకేయడం, ఆర్థికంగా బలహీనపడడం, ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ కష్టమయ్యే ప్రమాదం.. లాంటి సంకేతాల నేపథ్యంలో ఎలాగైనా గెలవాలనే తపన జగన్ లో కనిపిస్తోంది. ఆ పార్టీ సలహాదారుగా నియమితులైన ప్రశాంత్ కిశోర్ కూడా తన శక్తిమేర కృషి చేస్తున్నారు. అయితే పునాదుల నుంచి గట్టి సంస్థాగత నిర్మాణం కలిగి ఉన్న టీడీపీని ఒంటరిగా దెబ్బకొట్టడం అంత ఈజీ కాదని పీకే స్పష్టం చేశారట.
బీజేపీ లేదా జనసేనలతో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీని కాస్తోకూస్తో దెబ్బకొట్టగలమని పీకే చెప్పిన సూచనకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతానికి టీడీపీ – బీజేపీ అంటీముట్టనట్టు ఉంటున్నా టీడీపీని వదిలి బీజేపీ బయటకు వచ్చే అవకాశాల్లేవని వైసీపీ అంచనా వేస్తోంది. జగన్ పైనున్న అవినీతి ఆరోపణలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయోననే భయం బీజేపీలో కనిపిస్తోందట. అందుకే బీజేపీని నమ్ముకోవడం కంటే పవన్ ను మచ్చిక చేసుకుంటే మంచిదనేది ఇప్పుడు వైసీపీ ఆలోచన.
పవన్ ను మచ్చిక చేసుకోవాలంటే తమ దగ్గరున్న ఏకైక అస్త్రం ప్రత్యేక హోదా. స్పెషల్ స్టేటస్ కోసం పవన్ పోరుబాట పట్టారు. అందుకే తాము కూడా అదే నినాదం లేవనెత్తితే పవన్ కు దగ్గరయ్యే అవకాశం ఉందని జగన్ అండ్ కో భావించి అదే అంశంపై అనంతపురంలో యువభేరి పెట్టినట్టు కొంతమంది అంచనా వేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలి.