ఏపీలో పొత్తు రాజకీయాలు తెరవెనుక శరవేగంగా జరుగుతున్నాయి! ఎప్పుడు ఎవరు ఎవరికి మద్దతు ప్రకటిస్తారో తెలియదు గాని.. ఎన్నికలకు ఏడాదిన్నర సమయమే ఉండటంతో ఇప్పుడు పొత్తుల గురించి చర్చ మాత్రం ఆయా పార్టీల్లో జోరుగా నడుస్తోంది! ముఖ్యంగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బరిలోకి నేరుగా దిగుతుండటంతో.. ఆయనతో పొత్తు కోసం మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ తహతహలాడుతున్నాయి. అయితే రాష్ట్రానికి చేసిన మోసంపై బీజేపీపై ఆయన ఆగ్రహంతో ఉండటం తమకు ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తోంది.
వారి ఆలోచనలిలా ఉంటే.. పవన్ మాత్రం మాత్రం వీటి గురించి పట్టించుకోవడం లేదని సమాచారం! వేరే పార్టీల వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు జనసేనాని అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాడు. పాదయాత్ర చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించాడు. ఇక నుంచి పార్టీకే సమయం కేటాయిస్తానని చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నారట.
గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్.. ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా రు. తొలి నుంచి పవన్-చంద్రబాబు మధ్య స్నేహ బంధం ఎంత గట్టిగా ఉందో అందరికీ తెలిసిందే! ఇదే సమయంలో బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇటీవల జరుగుతున్న సంఘటనలు పవన్ ఆలోచనావిధానంలో కొంత మార్పు తీసుకొచ్చాయట. ప్రత్యేక హోదా ను ఆ రెండు పార్టీలు పక్కన పెట్టేయడంతో పవన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతోనైనా పయనిస్తామని జనసేనాని ఇప్పటికే ప్రకటించారు. ఇక టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కూడా పవన్ మనస్థాపానికి గురైనట్లు సమచారం.
ఇక రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ అంటేనే జనం మండి పడుతున్నారు. కాంగ్రెస్ నిర్వహించిన ప్రత్యేక హోదా సభకు పవన్ ఆహ్వానించినా ఆయన రాలేదు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండ దు. ఇక మిగి లింది వైసీపీ లేదా కమ్యూనిస్టు పార్టీలు! కమ్యూనిస్టులకు క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్నప్పటికీ… ఓటు బ్యాంకు లేదు. మరోవైపు నిన్న మొన్నటి వరకూ దీనిపై మౌనంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని షురూ చేస్తున్నారు. అనంతలో యువభేరి ఏర్పాటు చేశారు.
దీంతో వైసీపీతో పవన్ కలిసి వెళతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడంతో పొత్తు మంచిదని పవన్ సన్నిహిత వర్గాలు కూడా సూచించడంతో పవన్ కల్యాణ్ ఈ మేరకు పొత్తులకు మాత్రం సిద్ధమయ్యారు. మరి ఉన్న రెండు పార్టీలోతో వెళతారా లేక కేవలం సింగిల్గానే వెళతారా అనే చర్చ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.