తెలుగు పాలిటిక్స్లో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ గత నాలుగు రోజులుగా పెద్ద ట్రెండింగ్ మ్యాన్గా మారిపోయాడు. ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ పెళ్లిలో తెలంగాణ సీఎం కేసీఆర్తో రెండు మూడు నిమిషాల పాటు ఆయన జరిపిన ఏకాంత చర్చలే ఇప్పుడు మీడియాలో గరంగరంగా హైలెట్ అవుతున్నాయి. వాస్తవంగా చూస్తే కేశవ్ కేసీఆర్తో అలా మాట్లాడడం తప్పు పట్టాల్సిన అంశం కాదు. అయితే ఈ వ్యాఖ్యలకే ఆయన ఇటు ఏపీ టీడీపీలోను, అటు తెలంగాణ టీడీపీ నాయకులకు పెద్ద టార్గెట్ అయిపోయాడు.
కేశవ్ ఇలా టార్గెట్ అవ్వడం వెనక చాలా తంతే నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా టీడీపీలో కేశవ్ గట్టినేత. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పార్టీ గెలిచిన టైంలో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయనకు మంత్రి పదవి మిస్ అయ్యింది. తన కంటే జూనియర్ అయిన సునీత మంత్రి అయ్యి ఇప్పుడు జిల్లాను ఏలేస్తున్నారు. ఇది కేశవ్ ఎలాగైనా రాజకీయంగా ఇబ్బందిగా మారింది.
ఆ తర్వాత కేశవ్ ఎమ్మెల్సీ అయ్యి మొన్న జరిగిన ప్రక్షాళనలో మంత్రి పదవి ఆశించారు. అయితే సునీత, కేశవ్ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కేశవ్ ఆశలు నెరవేరలేదు. ఇక మంత్రి పదవి రాకపోవడంతో కేశవ్ చంద్రబాబును టార్గెట్గా చేసుకుని పార్టీలో కొందరు నాయకుల దగ్గర ఇష్టమొచ్చినట్టు మాట్లాడారట. ఇక సునీతకు జిల్లాకు చెందిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు ఉండడంతో బాలయ్యను కూడా కేశవ్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు బాబు వరకు వెళ్లాయి.
ఇవన్నీ మనస్సులో పెట్టుకున్న బాబు తాజాగా కేసీఆర్తో ఏకాంత చర్చల విషయంలో కాస్త అతిగా బిహేవ్ చేశావని వార్నింగ్ ఇవ్వడంతో పాటు పార్టీ కీలక పదవి నుంచి పయ్యావులను తప్పించారంటారు. అదొక్కటే కారణం కాదు. చాలా విషయాల్లో పయ్యావుల తీరు పై వ్యతిరేకత వచ్చిందంటున్నారు. జిల్లాలో జేసీ గ్యాంగ్తో అంటకాగుతూ సునీతకు యాంటీగా వ్యవహరిస్తుండడం... సునీతకు యాంటీగా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరితోను సపరేట్ గ్రూప్కు ప్లాన్ చేయడం కూడా మనోడికి పెద్ద మైనస్గా మారిందట. ఈ కారణాలే బాబు దృష్టిలో పయ్యావుల టార్గెట్కు కారణాలయ్యాయంటున్నారు.