కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ త్వరలోనే నూటపాతికేళ్ల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఆయనలో ఏమాత్రం పరిపక్వత కనిపించడం లేదు. ఇప్పటికీ ఆయన తప్పులు చేస్తూనే ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. నాలుక్కరుచుకున్నారు. తాజాగా మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆర్ఎస్ఎస్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేదని, అక్కడ ఎప్పుడైనా నిక్కర్లు వేసుకున్న మహిళలు కనిపించారా.. అని రాహుల్ ప్రశ్నించారు. ఆరెస్సెస్ లో మహిళలపై వివక్ష కొనసాగుతోందన్నారు. అక్కడెప్పుడూ షార్ట్స్ వేసుకున్న పురుషులు తప్ప మహిళలు తనకు కనిపించలేదన్నారు. అదే కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయన్నారు. స్త్రీలను కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తోందన్నారు.
రాహుల్ చేసిన కామెంట్స్ ఆరెస్సెస్ ఆగ్రహానికి కారణమయ్యాయి. నిక్కర్లు వేసుకున్న మహిళలు కావాలనుకుంటే రాహుల్ గాంధీ మహిళలు ఆడే హాకీ మ్యాచ్ కు వెళ్లాలని ఆరెస్సెస్ ఘాటుగా స్పందించింది. అసలు తప్పు రాహుల్ ది కాదని, ఆయన ప్రసంగాలు రాసే వాళ్లదని ఆరెస్సెస్ నేత మన్మోహన్ వైద్య ఆరోపించారు. అసలు ఆరెస్సెస్ అంటే ఏంటో, దాని పనితీరు ఏంటో.. దాని చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
అసలు ఆరెస్సెస్ కు, కాంగ్రెస్ పార్టీకి లంకె పెట్టడాన్నే చాలా మంది తప్పు బడుతున్నారు. ఆరెస్సెస్ రాజకీయ పార్టీ కాదు. అసలు ఆయన తమనెందుకు ద్వేషిస్తున్నారో అర్థం కావడం లేదని సంఘ్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా మహిళలపై తమకు, తమ పార్టీ వారికి ఏమాత్రం గౌరవం ఉందో రాహుల్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయని ఎద్దేవా చేశారు. మొత్తంగా రాహుల్ తెలిసీ తెలియక చేస్తున్న వ్యాఖ్యలు ఆయన్ను ఇరకాటంలోకి నెడుతున్నాయి.