రాజకీయాల్లో బాధ్యతలే భారాలు! ఇక్కడ ప్రత్యేకంగా వ్యక్తిగత భారాలంటూ ఉండవు. ప్రజల కోసం చేసే చేపట్టే పనుల్లోని సమస్యలే నేతలకు వ్యక్తిగత భారాలుగా మారిపోతాయి. బాబు టీం లోని మంత్రి నారాయణ నిన్న మొన్నటి వరకు ఇలానే ఫీలయ్యారు. విద్యా వ్యాపారం నుంచి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నారాయణ వీటిని అత్యంత వేగంగా ఒంటబట్టించేసుకున్నారు. ఇంతలోనే ఆయనకు సీఎం చంద్రబాబు ఏపీసీఆర్డీఏ ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆయన మురిసిపోయి.. పండగ చేసేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో తన శిలాశాసనం అయిపోతుంది కదా అనుకున్నారు. అయితే, అంతలోనే ఈ ఆనందం, ఆహ్లాదం ఒక్కసారిగా ఆవిరయ్యాయి.
ఏపీ రాజధానిని ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దాలని సీఎం భావించారు. దీనికి ప్రపంచంలోనే పేరొందిన వారిని రప్పించి వారికి ఈ రాజధాని బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇవేవీ బాబుకు నచ్చలేదు. దీంతో మంత్రిపై ఒత్తిడి పెరిగిపోయింది. రాజధాని డిజైన్ల కోసం నారాయణ తిరగని దేశం లేదు. చూడని రాజధానులు లేవు. వెళ్లని రాష్ట్రం లేదు. ఎక్కడ బెస్ట్ ప్లాన్ ఉందని తెలిస్తే..అ క్కడికి వెళ్లి వాలిపోయారు. అంతా పరిశీలించారు. బాబుకు నివేదించారు. అయితే, ఎప్పట్లానే బాబు వాటిని తిప్పికొట్టారు. దీంతో ఒకానొక దశలో నారాయణ తనలో తనే తీవ్రంగా మధన పడ్డారు.
తాజాగా నార్మన్ పోస్టర్ సంస్థ ఇచ్చిన ఆకృతులపైనా బాబు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇంక నారాయణ అసలు నా పరిస్థితి ఏంట్రా దేవుడా? అనే పరిస్థితి వచ్చింది. ఇంతలోనే చంద్రబాబు దర్శక ధీరుడు రాజమౌళిని ఈ రంగంలోకి దింపి డిజైన్లను ఖరారు చేయాల్సిన బాధ్యతను అప్పగించారు. దీంతో రాజధాని నిర్మాణాలకు ఆకృతులను నిర్ణయించే బాధ్యత రాజమౌళికి అప్పగించారు.
ఈ అనూహ్య పరిణామంతో మంత్రి పి. నారాయణ తనలో తనే ఉబ్బితబ్బిబ్బయ్యారట. హమ్మయ్య ఇన్నాళ్లకు నా మనసు కుదుట పడింది? అని తన సహచరులతో అనేశారట. రాజధాని నిర్మాణాల విషయంలో బాబు ఒక పట్టాన అంగీకరించకపోవడంతో మంత్రి పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదని అన్నారు ఆయన అనుచరులు. ఏదేమైనా ప్రస్తుతం మాత్రం మంత్రి హ్యాపీగా ఉన్నారట.! మరి రాజమౌళి ఎలా ఫీలవుతున్నాడో చూడాలి.