చైనా తో భారత్ ఎలాంటి వ్యాపార సంభందాలు ఏమంత ప్రయోజనాలు యివ్వకపోవచ్చు. చైనా భారత్ పట్ల ప్రవర్తించే తీరులో మోసం దగా, అలక్ష్యం విస్తృతంగా కనిపిస్తున్నాయి. వాణిజ్యంలో కూడా శతృత్వాన్ని కలబోసి చూసే శకునితత్వం చైనాది. దాని దృష్టి అంతా ప్రపంచాన్ని అనకొండలా చుట్టెయ్యాలని తప్ప మరే ఇతర మానవాళికి చెందిన సామాజిక సంక్షేమ భావనలు కనిపించవు.
"డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో, అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకున్న తరవాత మన దేశం పై అంతర్గత బయటికి కనిపించని శతృభావనను తనలో తానే రగుల్చు కుంటూ మన దేశంలో చేపట్టిన కొన్ని "మౌలిక ప్రాజెక్టు" లను చైనా నిర్లక్ష్యం చేస్తోందా? అంటే భారతీయ రైల్వేలు అవుననే జవాబి స్తున్నాయి. దాదాపు 400 కి.మీ పొడవున్న "చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్" ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ, చైనా ఈ రైల్వే ప్రోజెక్ట్ పనుల్లో ఎలాంటి పురోగతి చూపటంలేదని, అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
ఇందుకు భారత్–చైనాల మధ్య డోక్లామ్లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని "భారతీయ రైల్వే మొబిలిటి డైరెక్టరేట్" సమావేశంలో అధికారులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. "చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్ (సీఆర్ఈఈసీ)" 2016 నవంబర్లో నివేదిక సమర్పించిన అనంతరం భారతీయ రైల్వే బోర్డు అధికారులతో నేరుగా సమావేశం అవుతామని విజ్ఞప్తి చేసింది.
ఆ తరువాత వారివైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. "ఈ విషయమై 'సీఆర్ఈఈసీ' స్పందన కోసం గత 6 నెలలుగా ఈ–మెయిల్స్ పంపిస్తూనే ఉన్నాం. చివరికి ఇక్కడి చైనా ఎంబసీ ద్వారా కూడా ప్రయత్నించాం. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు" అని ఒక రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. కేవలం హైస్పీడ్ కారిడార్ మాత్రమే కాకుండా పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి చైనా రైల్వే ఆసక్తి చూపినప్పటికీ, డోక్లామ్ ఘటనతో వాటన్నింటిపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. వియత్నాం, జపాన్లతో భారత్ పెంచుకుంటున్న రాజకీయ వ్యూహాత్మక మైత్రి సహితం భారత్-చైనా సంభందాలు బలహీన పడేస్థితికి చేర్చాయని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై–బెంగళూరు–మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.