బీజేపీ సీనియర్ నేత, కేంద్రంలో రెండు సార్లు మంత్రిగా చక్రం తిప్పిన నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి గతంలో రైట్ హ్యాండ్గా వ్యవహరించిన తెలంగాణ నేత బండారు దత్తాత్రేయ ప్రస్తుతం ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రంలో ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో దత్తాత్రేయ తన పదవిని కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన దత్తాత్రేయ `అసలేం జరిగింది` అనే ప్రశ్నతో తల్లడిల్లి పోయారు. దీంతో ఆయన ఇప్పుడు అన్యమనస్కంగానే పార్టీలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ ప్రభుత్వంపైనా పెద్దగా విమర్శలు సైతం సంధించడం లేదు.
తాను పార్టీలో సీనియర్ నేతనని, ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న నేతలంతా తన తర్వాత వచ్చిన వారేనని ఆయన అంటూ ఉంటారు. అలాంటి తనను పార్టీ పక్కన పెట్టడం అంటే.. తనకు విలువ లేకుండా చేయడమేకదా? అని ఆయన తన అనుచరుల వద్ద వాపోయారు. దత్తన్న ఏటా ఇచ్చే అలయ్ భలయ్ కార్యక్రమాన్ని ఈ దఫా సాదాసీదాగానే నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా దత్తన్నలో పెద్ద హుషారు కనిపించలేదు. దీంతో అందరూ ఆయనను ఓదార్చే పనిలో పడ్డారని ఆఫ్ ది రికార్డుగా తెలిసింది. ప్రస్తుతం సికింద్రా బాద్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న.. దత్తాత్రేయ వచ్చే ఎన్నికల్లో మాత్రం దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి ఏపీలో బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరుగా ఉన్న దత్తన్న ఎన్నికల సమయంలోనూ కీలకంగా వ్యవహరించేవారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్రావు, చింతల రామచంద్రారెడ్డి వంటి వారు ఈయన అడుగుజాడల్లో నడిచి వెంకయ్యనాయుడిని స్ఫూర్తిగా తీసుకున్నవారు. అయితే, కేంద్రంలో మంత్రి పదవి పోవడంతో దత్తన్న తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఆ తర్వాత గవర్నర్ పదవి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చినా సికింద్రాబాద్ ఉప ఎన్నిక భయంతో బీజేపీ అధిష్టానం ఆ విషయం లైట్ తీస్కొంది. దీంతో దత్తన్న ఆశలు తల్లకిందులయ్యాయి.
ఇక వచ్చే ఎన్నికల నాటికి తాను స్వయంగా టికెట్ ఆశించబోనని, ఇంక రిటైర్మెంట్ తీసుకుంటే బెటరనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి చివరి నిముషంలో ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే, దత్తన్నకు బీజేపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దత్తన్న వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆ పార్టీకే చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సీటు కోసం కన్నేశారు. కిషన్రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి ముగ్గురూ ఈ ఎంపీసీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.