చేనే కంచె మేస్తున్న చందంగా తయారైంది తెలంగాణ పరిస్థితి! సాక్షత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్పీకర్ వంటి రాజ్యాంగ బద్ధ పదవులను అలంకరిస్తున్నవారిపైనే అవినీతి, లంచాల బాగోతానికి సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేఖలు ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయంగా ఎత్తులకు పైఎత్తులు వేయగల కేసీఆర్కు సైతం ముచ్చమటలు పోయిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. తెలంగాణలో ఉద్యమం నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణను స్థాపిస్తానంటూ ప్రజల్లో అనేక ఆశలు రేపింది. అయితే, విపక్షాలు మాత్రం అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తున్నాయి. దీన్ని తట్టుకోవడమే కేసీఆర్కు కష్టంగా ఉంది.
ఇంతలో హెచ్చరికలేని తుఫాను మాదిరిగా.. అధికార పార్టీలోని నేతలే ఎమ్మెల్యేల లంచాల బాగోతాలను వెల్లడిచేస్తున్నారు. నిన్న ఏకంగా స్పీకర్ మధుసూదనాచారి దాదాపు కోటి వరకు తనతో ఎన్నికల్లో ఖర్చు పెట్టించి కేవలం 50 లక్షలు తిరిగిచ్చి.. మిగిలింది అడిగితే.. సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని వరంగల్లోని శాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొలపెల్లి శ్రీనివాస్రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది పెను సంచలనంగా మారింది. దీనిపై విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. ఇంతలోనే మరో పిడుగు అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది.
నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డికి రూ.13 లక్షలు ఇచ్చానని మార్కెట్ కమిటీ చైర్మన్ బిడకన్నె హన్మంతు ఆరోపించారు. గత ఏడాది అక్టోబరులో మూడు లక్షల రూపాయల నగదును ఎమ్మెల్యేకు ఇచ్చానన్నారు. రూ.పది లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ఎమ్మెల్యే భార్య జయశ్రీ రెడ్డి అకౌంట్కు బదిలీ చేశానన్నారు. ‘‘నారాయణఖేడ్ మార్కెట్ చైర్మన్ పదవిని నాకు ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి కోరాను. ఎమ్మెల్యే నుంచి లేఖ తెచ్చుకోవాలని చెప్పారు. దాంతో, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కలిసి సిఫారసు లేఖ ఇవ్వాలని కోరాను.
ఆ పదవి కోసం ఇప్పటికే ముగ్గురు పోటీ పడుతున్నారని, నీకు పదవి కావాలంటే రూ.13 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే అడిగారు. ఆ మేరకు డబ్బు చెల్లించాను. ఆ డబ్బులతోనే ఎమ్మెల్యేకు స్కార్పియో వాహనం ఇప్పించాను’’ అని హన్మంతు తెలిపారు. ఎమ్మెల్యేపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, తన ఆరోపణలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. సో.. ఇదీ ఇప్పుడు తెలంగాణలో పాలన సాగిస్తున్న కేసీఆర్కు అగ్నిపరీక్ష ప్రారంభమైందని చెప్పడానికి మచ్చుతునకలు. మరి రోబోయే రోజుల్లో ఇంకెంత మంది బయటకు వస్తారో చూడాలి. ఏదేమైనా.. కాదేదీ అవినీతి అనర్హం, కాదెవరూ లంచాలకు అనర్హం అని అనిపించేస్తున్నారు. నిప్పుకు చెదలు పడితే... చెప్పేదెవరికి?!