ఈ మద్య విద్యార్థులు చదువుకోవాలంటే..ఎంతో డబ్బు వెచ్చించాల్సి వస్తుందని..ముఖ్యంగా కార్పోరేట్ కాలేజీల్లో ప్రయివేట్ యాజమాన్యం అధికంగా వసూళ్లు చేస్తున్నారని..దీంతో కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు పడే ఆవేదన చూసి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కార్పోరేట్ కాలేజీల్లో ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా హింసించి మరీ అత్యధిక సమయాన్ని చదువుకే కేటాయించేలా చేయడం.. దీంతో వారికి జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా అర్థాంతరంగా తమ తనువు చాలించడం అమానుషం అని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం ఘాటుగా స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
ఇప్పటి వరకు 40 మంది పిల్లలు చనిపోయినా చర్యలు లేవన్నారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆత్మహత్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం బాధ లేదన్నారు.కేవలం చంద్రబాబు ఫోటో పైన చెత్త వేశారని ఐఏఎస్ అధికారిణితో విచారణకు ఆదేశించారని, మరి పిల్లల జీవితాలను హరిస్తున్న నారాయణ, చైతన్యలపై విచారణకు ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.
విశాఖపట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిందిత కాలేజీపై ఏ చర్యలు తీసుకున్నారన్నారు.కార్పోరేట్ కాలేజీలపై తల్లిదండ్రులు ఎదురు తిరగాలని సూచించారు. కేబినెట్ నుంచి గంటాను, నారాయణలను తొలగించాలని డిమాండ్ చేశారు.