సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈనెల 26 వ తేదీ వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లాండ్ లలో చంద్రబాబు పర్యటన సాగనుంది. 18వ తేదీ నుంచి 20 వరకు అమెరికాలో, 21 నుంచి 23 వరకు UAEలో, 24 నుంచి 26వ వరకు UKలో పర్యటిస్తారు. 26వ తేదీతో చంద్రబాబు పర్యటన ముగుస్తుంది.
విదేశీ పర్యటనలో అనేకమంది రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు, ముఖాముఖి సమావేశాలు, బహుముఖ చర్చలు, ముఖ్యమైన కార్యక్రమాలలో సీఎం పాల్గొంటారు. UKలో ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డును చంద్రబాబునాయుడు స్వీకరిస్తారు. అమెరికాలో న్యూయార్క్, చికాగో, డెమాయిన్స్, ఐయోవా, UAEలో దుబాయ్, అబుదాబీ, UKలో లండన్లలో పర్యటిస్తారు.
అమెరికా పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 14 సమావేశాల్లో పాల్గొంటారు. చికాగోలో గ్లోబల్ తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ సభ్యులతో సమావేశమవుతారు. అలాగే పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పాలని.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. ఐయోవా స్టేట్ యూనివర్సిటీతో పాటు వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ ను సందర్శిస్తారు. రీసెర్చ్ పార్కులో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నాలెడ్జ్ కన్సార్టియంలో జరిగే చర్చలో పలు అంశాలపై మాట్లాడనున్నారు. ఐయోవా గవర్నర్ ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు.
కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్ పార్కు ప్రాజెక్టుపై స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్, టాప్ సైంటిస్టులు, సీడ్ కంపెనీలు, అగ్రి కంపెనీల ప్రతినిధులతో జరిగే సదస్సులో కర్నూలు సీడ్పార్కుగురించి వివరిస్తారు. పయినీర్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ తో పాటు అక్కడి వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం సందర్శిస్తారు. ఐయోవా ఎకనామిక్ డెవలప్మెంట్ అథారిటీ, ఐయోవా స్టేట్ వర్శిటీలో జరిగే రౌండ్ టేబుల్ సమాశానికి చంద్రబాబు హాజరౌతారు. ఐయోవా స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్, వేగనింగన్ యూనివర్శిటీ, ఐయోవా ఫామ్ బ్యూరో, ఘనా CSIR డైరెక్టర్ జనరల్, నార్తీ సెక్రటరీలతో జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. వరల్డ్ ఫుడ్ప్రైజ్ -2017 పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ కంపెనీల సీఈవోలు, సీఎక్స్ వోలతో జరిగే విందుకు హాజరవుతారు.
21 వ తేదీ నుంచి 23 వరకు జరిగే UAE లో పర్యటిస్తారు. తొలుత నాన్ రెసిడెంట్స్ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొంటారు. బిజినెస్ లీడర్స్ ఫోరమ్, ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ వెల్త్ మేనేజర్తో మీటింగ్ కు హాజరవుతారు. ఎమిరేట్స్ గ్రూపు-దుబాయ్ నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్, ఒమన్ ఎండోమెంట్ మినిస్టర్తో సమావేశమై కీలక అంశాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. UAE ప్రభుత్వ, పరిశ్రమల ప్రతినిధులతో జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. బిన్ జాయేద్ గ్రూపు అధిపతితోపాటు పలు కంపెనీల చైర్మన్ లు, ప్రభుత్వ ప్రతినిధులతో జరిగే సమావేశాలకు హాజరవుతారు.
ఈనెల 24 నుంచి 26 వరకు లండన్ లో పర్యటించే ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణ ఆకృతులను రూపొందిస్తున్న నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తో సమావేశమౌతారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం పెట్టుబడిదారులోతో జరిగే మీటింగ్ కు హాజరవుతారు. కంపెనీ డైరెక్టర్ల నాన్ ప్రాఫిట్ అపెక్స్ అసోసియేషన్-ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో 10 కంపెనీల సీఈవోలతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
అమెరికా, UAE, UK పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ఏపీఎన్ఆర్టీ వేమూరి రవి, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది వెళ్లారు. వీరితో పాటు UAE, యూకే పర్యటనలో మంత్రి పి.నారాయణ సీఎం వెంట ఉంటారు.