టీటీడీపీ ఫైర్బ్రాండ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో అనుసరించే వ్యూహాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు. నిన్నటికి నిన్న ఢిల్లీలో రాహుల్గాంధీని కలిసి వచ్చిన రేవంత్ ఇక్కడకు వచ్చాక వరుసగా టీ కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతున్నారు. దీంతో రేవంత్ కాంగ్రెస్లోకి వెళ్లిపోవడం కన్ఫార్మ్ అని అందరూ అనుకుంటోన్న టైంలో ఆయన తాజాగా ఈ రోజు టీటీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి వచ్చి అందరికి షాక్ ఇచ్చారు. వాస్తవానికి రేవంత్ వ్యవహారంపై చర్చించేందుకే టీడీడీపీ చంద్రబాబు సూచనల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే రేవంత్ ఈ సమావేశానికి రావడంతో అసలు రేవంత్ వ్యూహం ఏంటనేది ఎవ్వరికి అంతు పట్టడం లేదు.
ఇదిలా ఉంటే ఈ సమావేశంలో రేవంత్ తాను ఎవ్వరికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని, తాను ఏదైనా మాట్లాడాలనుకుంటే చంద్రబాబుతోనే మాట్లాడుకుంటానని తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి స్వదేశానికి వచ్చిన వెంటనే రేవంత్ ఆయన్ను అమరావతిలో కలుసుకుని తన రాజీనామా లేఖను స్వయంగా చంద్రబాబుకే ఇస్తారని తెలుస్తోంది. దీనిని బట్టి పార్టీ మారేందుకు మానసికంగా ఇప్పటికే సిద్ధమైపోయిన రేవంత్ కావాలనే టీటీడీపీ ప్రత్యేక సమావేశానికి వచ్చి ఇక్కడ పార్టీలో తనకు జరుగుతోన్న అవమానాలను ఏకరువు పెట్టినట్టు తెలుస్తోంది.
రేవంత్ డేరింగ్ డెసిషన్లు...
పార్టీ మారేందుకు సిద్ధమవుతోన్న రేవంత్ టీడీపీతో తనకు వచ్చిన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై రేవంత్ పదే పదే విరుచుకుపడేవారు. ఈ విషయంలో ఆయన కేసీఆర్ను ఏకేశారు. ఇప్పుడు తాను పార్టీ మారితే తనపై కూడా అధికార పార్టీ నుంచి అదే విమర్శలు రావడం ఖాయం. దీంతో రేవంత్ టీడీపీతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
2019లో నియోజకవర్గం మారతారా...!
ఒకవేళ ప్రస్తుతం కొడంగల్లో ఉప ఎన్నికలకు వెళ్లినా వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్సులు లేవని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో ఉన్న తాండూరుపై ఆయన కన్నేశారు. కొడంగల్ పక్కనే తాండూరు నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో కూడా రేవంత్కు మంచి గ్రిప్ ఉంది. రేవంత్ కొడంగల్ను వదులుకునేందుకు మరో కారణం కూడా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం మొన్న జిల్లాల పునర్విభజనలో ఏకంగా మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయింది. కొన్ని మండలాలు వికారాబాద్లో కలిశాయి. దీంతో రేవంత్ వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాకుండా తాండూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
తాండూర్లో కాంగ్రెస్కు బలమైన నాయకుడు లేకపోవడం, ప్రస్తుతం అక్కడ మంత్రిగా ఉన్న మహేందర్రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో శేరిలింగంపల్లికి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో రేవంత్ తనకు తాండూర్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. ఏదేమైనా రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీతో చాలా సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.