కులాల ప్రస్తావన లేకుండా ఓట్లు అడగడం, ఓట్లు వేయించుకోవడం, ఓట్లు గెలుచుకోవడం .. కులాల మాట ఎత్తకుండా ప్రజల మనసులు కొల్లగొట్టడం ఇక ఈ దేశం లో కుదరని పని కాబోలు. ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే నడుస్తోంది. కులం పేరు ని బహిరంగంగా ప్రస్థావిస్తూ తమ కులస్థులు అందరూ కలిసిపోరాటం చెయ్యాల్సిన టైం వచ్చింది అంటూ కాంగ్రెస్ నేతలు ఓపెన్ గా పిలుపుని ఇస్తున్నారు.
తెలుగుదేశం ని దగ్గరకి తీసుకుని కెసిఆర్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వెళుతున్నారు అనే మాటలు వినపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ - తెరాస వర్గాలు కలిస్తే గనుక, కలిసి పోటీ చేస్తే గనుక కమ్మలని దగ్గరకి తీసుకుని రెడ్లని కెసిఆర్ అవతలకి తోసేసినట్టే అని అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుల ముచ్చట్లు బహిరంగ ప్రెస్ మీట్ ల వరకూ వచ్చేసాయి.
‘రెడ్డి సోదరులారా.. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న రెడ్డి నాయకులారా.. జాగ్రత్తపడాల్సిన అవసరం ఉన్నది’ అంటూ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు! ఆ ఒక్క కులం సంఘటితం అయినంత మాత్రాన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయదు కదా! ఇతర కులాల ఓట్లు కూడా కావాలి కదా! ఆ విషయం జగ్గారెడ్డికి తెలియందేం కాదు.
రెడ్డి లకీ ఎస్సీ జనాలకీ అవినాభావ సంబంధం ఉంది అన్నారు. రెడ్లకి బీసీ లతో సంబంధం ఉంది అంటున్నారు ఆయన. వెలమల మీద ఆయనకి ఉన్న వ్యతిరేకత కూడా బయట పెట్టేసుకున్నారు జగ్గా రెడ్డి. వెలమలకూ బీసీలకు కూడా ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. కాబట్టి, రెడ్డి సోదరులారా, రెడ్డి నాయకులారా ఏకం కావాలంటూ, ఆ సమయం వచ్చిందని జగ్గారెడ్డి నిర్భీతిగా పిలుపునిచ్చారు.