తెలంగాణా ప్రాంతం లో చాలా కాలం క్రితమే టీడీపీ పార్టీకి నూకలు చెల్లిపోయాయి . గత ఎన్నికల్లో ఘోర పరాభవం తిన్న టీడీపీ ఇంకేదైనా మిగిలి ఉంటె GHMC తో క్లియర్ చేసేసుకుంది. ఇప్పుడు తమకి ఒక్కగానొక్క దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కి వెళ్ళిపోయినట్టే ఉన్నాడు. తనతో పాటు ఖచ్చితంగా ఒక అరడజను పైగా జనాలని తీసుకెళతాడు ఆయన.
కాంగ్రెస్ వేదికగా ఆయన పోరాటం సాగుతుంది. ఇప్పుడు తెరాస కి ప్రత్యర్ధి ఎవరు ఉంటారు? బీజేపీ - తెరాస దోస్తీ డిల్లీ లో గట్టిగానే ఉంది.ఈ పరిస్థితుల్లో…కాంగ్రెస్ మాత్రమే తెరాసకు ఏకైక ప్రత్యర్ధి కావడం తధ్యం. మరోవైపు తెలంగాణలో రేవంత్ లాంటి లీడర్లు పార్టీ మారతున్నారని తెలుస్తుండగానే కొడంగల్లో ఆయన అనుచరుల్ని తెరాస లాగేసింది.
ఇది తర్వాత కూడా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. టీడీపీ లో లీడర్ల సంగతి పక్కన పెడితే కనీసం కార్యకర్తలు కూడా మిగిలేలాలేరు. ఆ పార్టీ ని పట్టుకుని వేలడడం కన్నా తెరాస లోకి జంప్ చెయ్యడం బెస్ట్ అని అనుకుంటున్న వారు బోలెడు మంది ఉన్నారిప్పుడు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తానన్న కెసియార్ చివరకు ఆ పార్టీని ఏ స్థితిలోకి నెట్టారో తెలిసిందే.
మరి అలాంటి వ్యక్తి మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీని తేల్చి, దానిని నిలబెడతారా? ఏపీ కన్నా కూడా తెలంగాణా లో గట్టి కేడర్ ఒకప్పుడు ఉన్న టీడీపీ ఇలాంటి పరిస్థితి ని చవిచూస్తుంది అని ఎవ్వరూ అనుకోలేదు. ఒకవేళ తెరాస - టీడీపీ పొత్తు వచ్చినా ఓ అరడజనుకు కాస్త అటో ఇటో సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా, పార్టీ గెలిచాక తెదేపా ఎమ్మెల్యేలని కూడా తమ పార్టీలో కలిపేసుకోడని గ్యారంటీ ఏమిటి?