తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో త్వరలోనే రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలో రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు అప్పుడే ఎవరికి వారు చంద్రబాబు దగ్గర తమ లాబీయింగ్ స్టార్ట్ చేసేసినట్టు తెలుస్తోంది. ఏపీలో ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఒకరిద్దరికి రాజ్యసభ సీట్లు దక్కడం వరకు ఇబ్బందేమి లేకపోయినా పార్టీ తరపున తెలంగాణకు చెందిన వారు కూడా రాజ్యసభ సీట్లు ఆశించడమే ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టనుంది.
ఏపీ నుంచి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని మంత్రిగా తప్పించి ఆయన్ను బీసీ కోటాలో రాజ్యసభకు పంపుతారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు జరుగుతుందో ? చూడాలి. ఇక ఎస్సీ కోటాలో ప్రతిభాభారతి, జూపూడి ప్రభాకర్రావు కూడా రేసులో ఉన్నారు. ఇక ఓపెన్ కోటాలో కంభంపాటి రామ్మోహన్రావు సీటు ఆశిస్తుంటే సీఎం రమేష్ మరోసారి తనకు ఛాన్స్ రాదా ? అని లెక్కలు వేసుకుంటున్నారు. ఓపెన్ కోటాలో రాజ్యసభ సీటు ఆశిస్తోన్న వారి లిస్ట్ ఏపీ నుంచి చాలా పెద్దగానే ఉంది.
ఇక తెలంగాణ నుంచి మోత్కుపల్లి నర్సింహులు రాజ్యసభ సీటుపై లెక్కకు మిక్కిలిగా ఆశలు పెట్టుకున్నారు. గవర్నర్ పదవి రాకపోవడంతో బాబు తనను రాజ్యసభకు పంపుతారని ఆయన ధీమాగా ఉన్నారు. ఇక బాబునే నమ్ముకుని రైట్హ్యాండ్గా ఉంటోన్న తనకు కూడా రాజ్యసభ సీటు ఈ సారి ఇవ్వాలని రావుల చంద్రశేఖర్రెడ్డి బాబుపై బాగా ప్రెజర్ చేస్తున్నారు. ఏపీలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే టీడీపీకి రెండు దక్కనున్నాయి. ఈ రెండిటిని ఎవరికి పంచాలో తెలియక చంద్రబాబు సతమతమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ టైంలో ఏపీ కోటాలో తెలంగాణ వాళ్లను రాజ్యసభకు పంపితే ఏపీలో నాయకుల నుంచి వ్యతిరేకత రావచ్చన్న ఆందోళనలో బాబులో ఉంది. ఇక మోత్కుపల్లి ఎస్సీ కోటాలో ఆశలు పెట్టుకున్నా ప్రతిభాభారతి, జూపూడి కూడా అదే వర్గానికి చెందిన వారు కావడంతో మోత్కుపల్లి ఆశలు ఎంతవరకు నెరవేరతాయన్నది సందేహంగానే ఉంది. ఆయన ఏపీ నేతల మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి టీడీపీ నుంచి రాజ్యసభ లక్ కొట్టే ఆ ఇద్దరు నాయకులు ఎవరో ? చంద్రబాబు ఎవరికి టిక్ పెడతారో ? చూడాలి.