ఏపీలో 2019 ఎన్నికలకు అప్పుడే రెడీ అయిపోతోన్న వైసీపీకి ఓ వైపు వరుసగా షాకుల మీద షాకులు తగులుతుంటే మరోవైపు జగన్ వచ్చే నెల 3వ తేదీ నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. మరోవైపు కోర్టు కేసులూ ఆయన్ను తరుముతున్నాయి. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో వైసీపీకి, ఆ పార్టీ వాళ్లకు మాంచి జోష్లాంటి వార్త ఒకటి వినిపిస్తోంది. వైసీపీకి ఇప్పటికే ఉన్న రోజా లాంటి సినీగ్లామర్కు తోడుగా మరో సీనియర్ హీరోయిన్ కూడా జగన్ చెంతకు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
నిన్నటి తరం ఆంధ్రుల అందాల హీరోయిన్ జయప్రద పదిహేనేళ్లుగా యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. యూపీలోని రాంపూర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె ఆ తర్వాత గురువు అమర్సింగ్తో పాటు ఎస్పీ నుంచి సస్పెండ్ అయ్యారు. గత ఎన్నికలకు ముందే ఆమెకు యూపీలో రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని చూశారు. ఆమెకు గతంలో టీడీపీతో మంచి అనుబంధం ఉంది. ఆ తర్వాత ఆమె యూపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు.
ఇక గత ఎన్నికలకు ముందు ఆమె వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీ సీటు ఆశించారు. అయితే జగన్ అప్పటికే ఆ సీటును మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి ఇవ్వడంతో జయప్రద జగన్ను కలిసినా ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఇప్పుడు బొడ్డు ఫ్యామిలీ తిరిగి ఇప్పుడు టీడీపీలోకి వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు రాజమండ్రి నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు జయప్రద బరిలోకి దిగితే ఆమెకు సీటు ఇచ్చేందుకు జగన్కు పెద్ద కష్టం కాదు.
ఇక ఇప్పుడు జగన్ పార్టీ నుంచి చాలా మంది బయటకు వెళ్లిపోతుండడంతో జయప్రద లాంటి వాళ్ల ఎంట్రీకి, వాళ్లకు టిక్కెట్లు ఇచ్చేందుకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. వైసీపీలో ప్రస్తుతం రోజా లాంటి వాళ్ల సినీగ్లామర్ అండ ఉంది. ఇప్పుడు జయప్రద లాంటి సీనియర్ హీరోయిన్లు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు కూడా పార్టీలోకి వస్తే అది పార్టీకి ఎంతైనా యూజ్ అవుతుందన్న భావన వైసీపీ నాయకుల్లో ఉంది. మరి జయప్రద తెలుగు రాజకీయాల్లో ఎలా రీ ఎంట్రీ ఇస్తారు ? ఆమె ప్రస్థానంలో వైసీపీలో ఎలా ఉంటుందో ? చూడాలి.