ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన విషయం బయటకు రావడంతో ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు బయలు దేరాయి. అసలు వైఎస్ ఫ్యామిలీ అంటే రామోజీరావు ఉప్పునిప్పుగా ఉంటారు. ఇక రామోజీ అన్నా, ఆయన మీడియా అన్నా నాడు తండ్రి నుంచి నేడు జగన్ వరకు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఇక చంద్రబాబు, టీడీపీకి రామోజీ, ఆయన మీడియా ఎలా వత్తాసు పలుకుతాయో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతోన్న పరిణామాలు గమనిస్తోన్న వారు రామోజీకి, చంద్రబాబుకు ఎక్కడో గ్యాప్ వచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు.
ఇందుకు కొన్ని పరిణామాలు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. ఈనాడుకు ధీటుగా ఉండే మరో ప్రముఖ తెలుగు దినపత్రికలో చంద్రబాబు తనయుడు ఏకంగా రూ.300 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టినట్టు మీడియా సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రబాబు, టీడీపీ సర్కార్కు సదరు పత్రిక భారీగా ప్రచారం చేస్తోంది. వైఎస్.జగన్కు వ్యతిరేకంగా పదే పదే యాంటీ వార్తలు ప్రచారం చేస్తూ విషం చిమ్మడంతో పాటు ఇటు టీడీపీ, చంద్రబాబుపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఇక ఫిరాయింపులు ప్రోత్సహించే విధంగా సదరు పత్రిక, ఛానెల్ అయితే నియోజకవర్గాల పెంపుతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ ఎన్నో వార్తలు పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేసింది.
ఇక ఈనాడు మాత్రం ఇటీవల తన తీరును పూర్తిగా మార్చుకుంది. టీడీపీ, వైసీపీ విషయంలో చాల మధ్యస్తంగా ఉంటోంది. జగన్తో పాటు వైసీపీ వార్తలకు కూడా మంచి కవరేజ్ ఈనాడులో వస్తోంది. ఈ న్యూట్రల్ విధానంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చల్లోనే రామోజీ-బాబు మధ్య గ్యాప్ అంశంకూడా ప్రస్తావనలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ అధినేత జగన్ సోమవారం సాయంత్రం రామోజీతో భేటీ అవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సుమారు 40 నిమిషాలపాటు వీరిద్దరు మంతనాలు జరిపారు. సీబీఐ కోర్టు తీర్పు పరిణామాలు, పాదయాత్రపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం. జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు.
ఇక త్వరలో జగన్ ప్రారంభించే పాదయాత్ర సక్సెస్ అవ్వాలని రామోజీ ఆశీస్సుల కోసమే జగన్ రామోజీని కలిసినట్టు వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. ఇక గతంలో జగన్కు బంధువు అయిన మోహన్బాబు తనయుడు మనోజ్ పెళ్లిలో కూడా జగన్-రామోజీకి పాదాభివందనం చేయడం పెద్ద సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏదేమైనా జగన్-రామోజీ భేటీ ఏపీ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. జగన్ రామోజీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ భేటీపై టీడీపీ వర్గాలు ఆరాలు పేరాలు తీసేపనిలో ఉన్నాయి.