కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను పాటించి రాజకీయ నాయకుల కేసులపై తదనుగుణంగా స్పందిస్తె బలమైన దెబ్బ వైసిపి అధినేత జగన్ మోహన రెడ్డి పై జీవితకాల నిషేధం రూపంలో పడే అవకాశాలున్నయని అంటున్నారు.
2014 నుండి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 1500 మందికి పైగా ఉన్న రాజకీయ నాయకులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటుకు వచ్చే నెలలో ఒక ప్రణాళిక తో హాజరు కావాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి తెలిపింది. అంతే కాదు సత్వర విచారణ (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) నిమిత్తం ఏర్పాటుచేసే కోర్టులకు ఎంత ఖర్చు అవుతుందో తెలియ జేయాలని కోరింది.
2014 లో కేసులు నమోదైన 1581 మంది రాజకీయ నాయకులలో ఎందరు దోషులుగా తేలారు? ఎందరు నిర్దోషులుగా బయట పడ్డారు? వారు ఎవరు? అలాగే కొత్తగా వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయని ప్రశ్నించింది.
"ఫాస్ట్ ట్రాక్ కోర్టు" ల ఏర్పాటుకు పూర్తి నివేదికను తమకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. నేరం ఋజువైన పక్షంలో రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలన్న విషయంలో కేంద్రం వైఖరి వెల్లడించాలని వ్యాఖ్యనించింది. "ఫాస్ట్ ట్రాక్ కోర్టు" లు ఏర్పాటుచేయడం వల్ల నేరం త్వరగా రుజువుతుందని పేర్కొంది.
మరోవైపు రాజకీయ నాయకులు నేరానికి పాల్పడినట్టు రుజువైతే, ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలంటూ ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) బుధవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది 'అశ్వని ఉపాధ్యాయ' ఒక వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ తర్వాత విచారణ సమయంలో తమ వాదనలు వినిపించేందుకు మరికొందరు చేరారు.
అయితే ఆ తరవాత ఎన్నికల సంఘం నుంచి మాత్రం వెంటనే సరైన స్పందన రాలేదు. దీంతో, జులై 12 న విచారణ సందర్భంగా ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరం రుజువైన రాజకీయనాయకులను జీవితకాలం నిషేధించే విషయంలో స్పష్టమైన వైఖరిని తెలియజేయడం లేదంటూ మండిపడింది. సుప్రీం-కోర్ట్ ఝలక్ తో ఎన్నికల సంఘం, మత్తు నుంచి బయటపడి, నేరం రుజువైన రాజకీయనాయకులను జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనే తన వైఖరిని తెలియజేసింది.
తుది విచారణ కేంద్ర ప్రభుత్వ స్పందన తో ముగిసి తీర్పు రావటానికి ఇంకెంత కాలం పడుతుందో? సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం కనుక కార్యరూపం దాలిస్తే వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తో సహా దేశ వ్యాప్తంగా 1600 మంది రాజకీయ నాయకులు నేరస్తులుగ, శిక్షార్హులుగా నిర్ధారించబడితే వారికి కనబడేది తారామండలమే. నేరాలు ఋజువైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.
ఆరేళ్ళ కన్నా ఎక్కువ జైలు శిక్ష పడిన వారికి శిక్షాకాలం పూర్తయ్యాక, నాలుగేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇప్పటికే నిషేధం ఉందని, దీన్ని జీవిత కాలనిషేధంగా మార్చాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తోంది. దీనికి ఉదాహరణ గా బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ను చెప్పవచ్చు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు అయి, అతి వేగంగా విచారణలు పూర్తయితే తొలి దశలోనే జగన్ సమస్యల్లో పడొచ్చు, లేదా త్వరగా నిర్దోషిగా బయటకు వస్తే, దర్జాగా రాజకీయాలు నెరపవచ్చు. ఒక్క జగన్ కే కాదు కేసులు ఎదుర్కొంటున్న అనేకమంది నేతల మీద కూడా ఈ తీర్పు ప్రభావం ఉండనుంది.
ఇప్పటి వరకు 18 కేసుల్లో ‘స్టే’లతో నెట్టుకొస్తున్న చంద్రబాబుకే ఇక ఇబ్బందులు మొదలవుతాయని ఈ కేసుల్లో విచారణ ప్రారంభం అయితే చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పని పరిస్థితులు ఎదురవుతాయని నెట్టింట్లో విమర్శిస్తున్నారు. వీటికి తోడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ఇక కేసీఆర్ కూడా రక్షించలేడని సెటైర్లు వేస్తున్నారు. కోర్టులను మేనేజ్ చేస్తూ తాను నిప్పునని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునే చంద్రబాబు ఇక కోర్టు బోనులో నిలబడే సమయం ఆసన్నమైందని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.