భారత్ అతి ముఖ్యమైన వాంటెడ్ ఉగ్రవాది, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత, పంజాబ్ పఠాన్ కోట్ దాడికి సూత్రధారి అయిన మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఐక్యరాజ్య సమితి ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. 1267నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని ప్రవేశపెట్ట గా చైనా దానిని వరుసగా నాలుగో సారి అడ్డుకుంది. మసూద్ అజర్ విషయంలో చైనా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారత రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితిలో చైనా ప్రవర్తించిన తీరు వల్ల, భారత్ తో దాని సంబంధాలు చాలా తీవ్రతర ప్రమాదకరస్థాయి లోకి వెళ్లే అవకాశముందని రక్షణశాఖ నిపుణులు పీకే సింగ్ ఊహిస్తున్నారు. చైనా ఐక్యరాజ్య సమితిలో తనకు ఉన్న వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ తో తన సంబంధాన్ని చైనా కాదనుకుంటోంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాదం విషయంలో చైనా అసుసరిస్తున్న ద్వంద్వప్రమాణాలకు ఇదొక నిదర్శనమని మరో రక్షణశాఖ నిపుణుడు రాహుల్ జలాల్ అన్నారు. మసూద్ అజర్ విషయం పై చైనా విదేశాంగ శాఖ కార్యదర్ధి హు చునియాంగ్ మాట్లాడుతూ, మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయని చెప్పారు. మసూద్ అజర్ పై భారత్ చాలా అంశాలకు వివరణ ఇవ్వలేకపోయిందని ఆరోపించారు.
హు చునియాంగ్
రక్షణ నిపుణులు చైనాపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ దేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తనకుగల వీటో అధికారాన్ని దుర్వినియోగపరుస్తోందని దుయ్యబట్టారు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారతదేశం చేస్తున్న విజ్ఞప్తులను అడ్డుకుంటూండటాన్ని వారు తప్పు బట్టారు.
ప్రముఖ రక్షణశాఖ నిపుణులు పీ.కే.సెహగల్ మాట్లాడుతూ చైనా చర్యలు, ప్రవర్తన చైనాతో భారత సంబంధాలను మరింత బలహీనపరుస్తాయని హెచ్చరించారు. చైనా వైఖరి "గతం కన్నా భిన్నం" గా లేదని మనకు ఈ సందర్భంలో తేటతెల్లమైందని అన్నారు. పాకిస్థాన్ ను చైనా ఎప్పటికీ మోసం చేసి తమ సంభందాలను నాశనం చేసుకోదని, భారత్ కి మద్దతిస్తున్న ఇతర దేశాల అభిప్రాయాలను నిర్లక్ష్యంగా చైనా ఉపేక్షిస్తూ ఉందని, తన వీటో అధికారాన్ని కూడా పాకిస్థాన్ కోసం దుర్వినియోగ పరుస్తోందని చెప్పారు.