అవును! కాకలు తీరిన రాజకీయ యోధుడిగా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రస్తుతం తీవ్రమైన టెన్షన్తో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన టెన్షన్కు నియోజకవర్గంలో తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండి, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా కాదట. స్వపక్షంలోనే ఆయనకు మరో హీరోయిన్ ఎర్త్ పెడుతుందన్న టెన్షన్ గాలికి బాగా పట్టుకుందట. గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని, తాను కూడా ఎలాగూ ఎమ్మెల్యేగా గెలుస్తానని అనుకున్న గాలి అనూహ్యంగా రోజా చేతిలో 900 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
పార్టీ అధికారంలోకి వస్తుందని, మంత్రి పదవి గ్యారెంటీ అని ఆశలు పెట్టుకున్న గాలికి రోజా పెద్ద షాకే ఇచ్చారు. దీంతో గాలి 2019పై ఆశలు పెట్టుకున్నారు. కనీసం అప్పుడైనా రోజాను మట్టికరిపించి.. తన పీఠాన్ని తాను కైవసం చేసుకోవడంతో పాటు ఈ సారి అయినా మంత్రి అవ్వవచ్చని ప్లాన్లో ఉన్నారు. నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఆయన ఇటీవల రోజాపై నిప్పులు చెరుగుతున్నారు. నగరిలో సీఎం ఫండ్ నుంచి భారీగా డబ్బులు తెచ్చి రోడ్లు వేయించానని, పింఛన్లు ఇప్పించానని తెగ ప్రచారం చేసుకుంటున్నారు గాలి.
అంతేకాదే, చంద్రబాబు పిలుపునిచ్చిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని రేపో మాపో మొదలు పెట్టాలని కూడా ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుంటున్నారు. చంద్రబాబును కాకా పట్టే పనిలో కూడా పడ్డారు. మరో ఏడాది లేదా ఏడాదిన్నరలో జరగనున్న ఎన్నికలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రోజా మరింత దూకుడుగా ముందుకు వెళుతుండడంతో గాలి వచ్చే ఎన్నికల్లో పోటీపై రెండు ఆప్షన్లతో ఉన్నారు. ఎన్నికల టైంకు తనకు పరస్థితి బాగోలేకపోతే తన తనయులను రాజకీయాల్లోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు.