ప్రధానమంత్రి నరేంద్రమోడీ యేడాది క్రితం కరెక్టుగా ఈ రోజు తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనానికి కారణమైంది. దేశవ్యాప్తంగా ఉన్న నల్లధనబాబులకు చెక్ పెట్టేందుకు వీలుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా అప్పటికప్పుడు మోడీ ఈ నిర్ణయం ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ పెద్ద నోట్ల రద్దు అమలు చేసి అప్పుడే యేడాది పూర్తయ్యింది.
మరి ఈ నిర్ణయం భారతావానికి ఏమైనా మేలు చేసిందా ? మోడీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా ? అన్న ప్రశ్నలకు మాత్రం ఆన్సర్ లేదు.
మోడీ సర్కార్ చేసిన ఈ పని వల్ల దేశంలో నల్లధన ప్రవాహం తగ్గలేదు. వెలుగులోకి వచ్చిన నల్లధనం చాలా చాలా తక్కువ. పోనీ ప్రజలంతా డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపారా..? అంటే అదీ లేదు. ఈ ప్రశ్నలకు సరైన ఆన్సర్లు లేకపోవడంతో దేశవ్యాప్తంగా సామాన్య జనాలతో పాటు విపక్షాలు, వామపక్షాల నుంచి పెద్దెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిని కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీయే అనుకూలపక్షాలు అనుకూల ర్యాలీ చేపడుతుంటే, విపక్షాలు మాత్రం నవంబర్ 8ని బ్లాక్డేగా వర్ణిస్తూ.. దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నాయి.
మోడీ గతేడాది 8వ తేదీ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఎంతోమంది సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల వద్ద క్యూలలో నిల్చొని మృతిచెందిన వారి లెక్క వందల్లోనే ఉంది. ఈ నోట్ల రద్దు వల్ల ఎంతో మంది పేదలు, కార్మికులు, రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మోడీ అనాలోచిత చర్యల వల్ల బ్యాంకుల్లో దాచిన ప్రజల సొమ్ములు కూడా వారి అవసరాలకు చేతికందకుండా పోయాయి. ఫలితంగా పెళ్లిళ్లు ఆగిపోయాయి డబ్బులు సమయానికి చేతికందక శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. అయితే దీని వల్ల ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు సరికదా... భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు మందగించింది. దీనికి తోడు జీఎస్టీ కూడా మైనస్గా మారింది.
ఇక విదేశాల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని ఇండియాకు రప్పిస్తామని మోడీ చేసిన హామీ కూడా నెరవేరలేదు. ఇదిలా ఉంటే నోట్ల రద్దుకు యేడాది పూర్తవుతోన్న వేళ విపక్షాలు నిరసనలకు దిగుతుంటే, అధికార బిజెపి, పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ... నవంబర్ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఏదేమైనా ఫైనల్గా నోట్ల రద్దు వల్ల దేశానికి ఒరిగింది తక్కువ అయితే సామాన్యులు పడిన ఇబ్బందులకు లెక్కేలేదు.