అవును! ఏపీ అసెంబ్లీలో ఈ దఫా ఒకేసారి నిర్వహిస్తున్న వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో వింత పరిస్థితి ఎదురు కానుంది. ఈ నెల 10 నుంచి అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో సభ నడపనున్నారు. దీనిని సుమారు 10 రోజులు నిర్వహించాలని ఇప్పటికే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. అయితే, ఎప్పుడూ లేనిది ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాన, ఏకైక విపక్షంగా ఉన్న వైసీపీ ఈ సమావేశాలను బాయ్ కాట్ చేస్తోంది. తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను వివిధ ప్రలోభాలకు గురి చేసిన చంద్రబాబు.. టీడీపీ లోకి చేర్చుకున్నారని, ఇలా జంప్ చేసిన 22 మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేయాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు.
వారిపై వేటు వేసే వరకు అసెంబ్లీ గడప తొక్కబోమని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ పక్షంలో కదలిక వచ్చింది. అస్సలు ప్రతిపక్షమే లేకుండా సభ నిర్వహించడమా? అని సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డారు. కొన్నిరోజులు జగన్పై మాటల దాడులు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే, అవిఅంతగా వర్కవుట్ కాలేదు. నేతలు జగన్ను తిట్టినా.. ఇది కామనే కదా అని జనాలు లైట్ తీసుకున్నారు. ఇక, జగన్ పాదయాత్ర ప్రారంభించేసరికి.. బాబులో ఇంకా భయం పట్టుకుంది. పాదయాత్రతో జగన్ మార్కులు కొట్టేస్తున్నారని, దీనికితోడు అసెంబ్లీని ఎందుకు బాయ్ కాట్ చేసిందీ చెబితే పరిస్థితి ఏంటని బుధవారం హుటాహుటిన అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన చర్చలు జరిపారు.
వైసీపీ శాససభను బహిష్కరించినందున, ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి వివిధ సమస్యలను టీడీపీ ఎమ్మెల్యేలే సభ దృష్టికి తీసుకురావాలని బాబు ఆదేశించారు. ఇప్పటి వరకూ వైసీపీ, కాంగ్రెస్ తమ ప్రభుత్వంపై చేసిన ప్రతి ఆరోపణ, విమర్శలకు సభలోనే జవాబు చెప్పాలని నిర్ణయించారు. ఆ ప్రకారం రోజుకో సమస్యను ప్రస్తావించి, దానికి స్టేట్మెంట్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతిపక్షాలు తమపై చేసిన ఆరోపణలకు సంబంధించిన అంశాన్ని రోజుకొకటి తామే ప్రస్తావించి, వాటికి వివరణ ఇవ్వడం ద్వారా ప్రజలకు వాస్తవాలేమిటో చెప్పాలని టీడీపీ భావిస్తోంది.
అయితే, అసలు విపక్షమే లేకుండా అసెంబ్లీ నడవడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. అయినా, భేషజాలకు పోకుండా జగన్తో సంప్రదింపులు జరిపితే బాగుండేదని, కానీ, బాబు కూడా తన రాజకీయ పరిణితిని వినియోగించకుండా దుందుడుకుగా వ్యవహరిస్తే.. నష్టాలు తప్పవని చెబుతున్నారు. అధికార పక్షమే ప్రతిపక్షంగా మారినా.. ప్రజల్లో చులకన తప్ప మరొకటిఉండదని అంటున్నారు. మరి బాబు వింటారా? జగన్ మారతాడా? ఇవి రెండూ మిలియన్ డాలర్ల ప్రశ్నలే!!