రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం! నిన్న ముద్దయిన వారు నేడు బద్ధ శత్రువులు కావొచ్చు. నేటి శత్రువులే రేపు మిత్రులూ కావొచ్చు. ఏం జరిగినా.. రాజకీయాల్లో భాగంగానే చూడాలి అంటారు నేతలు. ఇక, ఇప్పుడు ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండలో మంచి ఫామ్లో ఉన్న నేత గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఎంపీగా ఉన్నారు. అయితే, ఆయన కొన్నాళ్ల కిందట అధికార టీఆర్ ఎస్లో చేరిపోయారు. అప్పట్లో అంతా సవ్యంగానే సాగింది వ్యవహారం. అయితే, రోజులు గడిచే కొద్దీ.. గుత్తా వ్యవహారం యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది. కాంగ్రెస్తో తలపడితేనే కానీ, ఢీ అంటే ఢీ అంటేనేకానీ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని గులాబీబాస్ నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే రేవంత్ వంటి ఫైర్ బ్రాండ్లు కాంగ్రెస్లోకి చేరిపోయారు. దీంతో అలాంటి వాళ్లకు ఎదురు నిలిచేలా మరింత మందిని తన కారెక్కించుకుంటేనే తప్ప ఫలితం ఉండదని భావించిన కేసీఆర్ ఆదిశగా చక్రం తిప్పారు. నల్లగొండకు చెందిన నేతలను ఆకర్షించాలని భావించారు. ఈ క్రమంలోనే కంచర్ల భూపాల్ రెడ్డి(రేవంత్కు సన్నిహితుడు) సోదరులను రెండు రోజుల కిందట పార్టీలోకి ఆహ్వానించి స్వయంగా కండువా కప్పారు. ఈ పరిణామమే ఇప్పుడు టీఆర్ ఎస్లో మంటలు రేపుతోంది.
నిజానికి గుత్తా కాంగ్రెస్లో ఉండగా.. కంచర్ల టీడీపీలో ఉన్నారు.వీరిద్దరి మధ్యా సఖ్యత లేకపోగా.. తీవ్ర విమర్శలు కూడా చేసుకున్నారు. గుత్తా, కంచర్ల కుటుంబాలకు గ్రామ స్థాయి నుంచే రాజకీయంగా విభేదాలున్నాయి. గతంలో గుత్తా.. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఉన్న వైరం ఈయన కాంగ్రెస్లోకి జంప్ చేశాక మరింతగా పెరిగాయి. ఒకరకంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితే ఉంది. ఇలాంటి నేతను పనిగట్టుకుని కేసీఆర్ తన పంచన చేర్చుకోవడంపై గుత్తా మండిపడుతుండగా.. మరో పరిణామం ఆయనకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కంచర్లను టీఆర్ ఎస్లోకి చేర్చుకున్న కేసీఆర్ వెంటనే ఆయనను నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్గా నియమించేశారు.
అంతేకాదు, ఎంపీ గుత్తాకి స్వయానా బంధువైన దుబ్బాక నరసింహారెడ్డిని తప్పించి కంచర్లను నల్లగొండ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించడం గుత్తాకు మింగుడుపడటం లేదు. దీంతో గుత్తా కాలుకాలిన పిల్లిలాగా సన్నిహితుల వద్ద చిందులు తొక్కుతున్నారు. కేసీఆర్ తనను కావాలనే బద్నాం చేయాలని భావిస్తున్నారా? అని గుత్తా వ్యాఖ్యానిస్తున్నారు. మరి నిజంగానే గుత్తాకి కేసీఆర్ పొగపెడుతున్నారా? అన్నది వేచి చూడాల్సిందే!