వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నేత 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్ని సమస్యలు ఎదురైనా.. ప్రజాసంకల్ప పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనట్టు వార్తలు కూడా వచ్చాయి. అయినా కూడా ఆయన నడుముకు బెల్ట్ పెట్టుకుని జనాల్లో తిరుగుతున్నారు. రోజుకు కనీసం పది కిలో మీటర్లు తగ్గకుండా పాదయాత్ర చేస్తూ.. పేదల కష్టాలు ఓపికగా వింటున్నారు. ఇక, ఈ క్రమంలోనే జగన్ ఏరికోరి బీహార్ నుంచి తెచ్చుకున్న ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్(పీకే) బృందం కూడా పాదయాత్రను ఫాలో అవుతోంది. దాదాపు 50 మంది వరకు టీం మెంబర్లు జగన్ను ఫాలో అవుతున్నారు.
వీరికోసం ప్రత్యేకంగా భారీ వాహనాన్నే ఏర్పాటు చేశారు. టిఫిన్లు, టీలు, భోజనాలు పూర్తిగా సెపరేట్. సమీపంలోని స్టార్ హోటళ్ల నుంచి క్యారేజీలు వీరికి చేరిపోతున్నాయి. వాస్తవానికి ఈ బృందం అంతా డబ్బు తీసుకుని జగన్కు సేవలు చేస్తోంది. పార్టీ పరిస్థితిని అంచనా వేస్తోంది. అయితే, పాదయాత్ర లో ఈ టీం సభ్యులు వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో పీకే టీం చెందిన ఓ యువతి ఆయన పక్కనే నిలబడి అంతా రికార్డు చేస్తోంది. మొదట్లో ఈమె ఎన్నారై కార్యకర్త అయి ఉంటుందని అందరూ భావించారు. అయితే, రోజులు గడిచే కొద్దీ వీరి విషయం బయటకు తెలిసింది.
ఈమె పీకే టీం మెంబర్ అని, జగన్ ప్రసంగంలో ఏమైనా పొరపాట్లు వుంటే, ఏదైనా విషయం మరిచిపోతే.. వెంటనే గుర్తు చేయడం తోపాటు సరిచేసేందుకు ఇలా పక్కనే నియమించుకున్నారని తెలిసింది. దీంతో విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి జగన్ అంతటి నేతకు అదే స్థాయిలో ఉన్న నేతలు పక్కన నిలబడాలి కానీ, ఇలా పీకే వంటి సలహాదారులకు చెందిన మెంబర్ ఇలా నిలబడితే.. స్థానికంగా ఉన్న నేతలకు చోటు లేకపోవడంతోపాటు.. జగన్.. పీకే స్క్రిప్ట్ చదువుతున్నాడనే అనుమానాలు కలగకుండా ఉంటాయా? ఇది పార్టీకి ఎలా మేలు చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిణామం జగన్కు ఎదురు వస్తుందని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలోనే చంద్రబాబు.. పీకే విషయంలో జగన్పై పలు విమర్శలు చేశారు. సొంతంగా పార్టీని నడిపించుకోలేని వాళ్లకు కూడా సీఎం సీటు కావాలంటూ ఎద్దేవా చేశారు. ఇక, ఇప్పుడు ఇలా పీకే టీం సభ్యులు పాదయాత్రను కూడా డామినేట్ చేస్తే.. జగన్ పరువు మరింత అభాసు పాలు కావడం తథ్యం అంటున్నారు. అంతేకాదు, కోరికోరి టీడీపీకి మరో ఆయుధం అందించినట్టేనని చెబుతున్నారు. రేపు జగన్కి ఓటే స్తే.. పాలించేది పీకే ఆయన టీం సభ్యులేనని టీడీపీ ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని హెచ్చరిస్తున్నారు. మరి జగన్ స్పందిస్తాడో లేదో చూడాలి.