ఇది ప్రజాస్వామ్యయుగం. పరిపాలనలో ఉత్తమం ప్రజాస్వామ్యం. పాలన పరిణామ క్రమంలో జాతులు ఉన్నతంగా ఎదిగి మానవ సామాజిక జీవన వికాసానికి దారి చూపింది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం పాలన సాగిస్తుంటే ప్రతిపక్షం ప్రజల పక్షం వహించి ప్రభుత్వంలోని తప్పులను "రంద్రాన్వేషణ" చేసి సరైన పాలన ప్రజల కు అందేలా చేస్తుందనేది ప్రజాస్వామ్య రీతి నీతి.
"ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ నడుస్తుందని, అధికారపక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తుందని టీడీపీ నేతలు చెప్పటం ధారుణ నయవంచన" అధికార పక్షం ఏనాటి కీ పతిపక్షం కానేరదు. అయితే టిడిపి వారు అలా చెబుతున్నా అంతరాంతరా ల్లొ వారు అంతర్మధనం చెందుతున్నారు. 'అసెంబ్లీని వైసీపీ బాయ్-కాట్' చేయడంపై టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ సంభాషణల్లో ఏం చెబుతున్నారన్న దానిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం, వైసీపీ వ్యూహంతో తాము ఇబ్బందుల్లో పడ్డామని అధికారపార్టీ సభ్యులు వాపోతున్నారు.ప్రతిపక్షంలేకుండా అసెంబ్లీ జరగడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదని, అలా జరిగితే ఆ ' ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నిర్మూలించిందనే' మాట విశ్వవ్యాప్తమౌతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం దమననీతిపై దేశవ్యాప్త రాజనీతిఙ్జులు చర్చిస్తూనే ఉన్నారు. శాసనసభలో సభాపతుల అధికార దుర్వినియోగంపై, చట్టంలోని లోపాలను వినియోగించుకొని రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వాళ్లు తిలోదకాలిస్తున్నారని చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
జగన్ అలాంటి పరిస్థితిని సృష్టించడం ద్వారా జాతీయస్థాయిలో "ప్రతిపక్షం లేని శాసన సభ" గా ఆంధ్రప్రదేశ్ శాసనసభను 'హైలైట్' చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించేలా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజతంత్రం నెఱిపారని గోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. పల్నాడు ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పత్రిక చెబుతోంది. అసెంబ్లీ టీ-బ్రేక్ సమయంలోనూ సభ్యులమధ్య వైసీపీ బాయ్కాట్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోందని వెల్లడించింది.
అసెంబ్లీని వైసీపీ బహిష్కరించడం ద్వారా "ఏపీలో భారీగా జరిగిన ఫిరాయింపుల" ను జాతీయస్థాయికే గాక అంతర్జాతీయ స్థాయికి అందరి దృష్టికి తీసుకెళ్లడంలో నిజంగా వైసీపీ విజయం సాధించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఒకరు అభిప్రాయపడ్డారు. జగన్ను తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఫిరాయింపుల అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం గట్టిగానే పనిచేస్తోందని సదరు పొలిట్ బ్యూరో సభ్యుడు వ్యాఖ్యానించారు. ఈ పరిణామం జాతీయస్థాయి లో టీడీపీ ప్రతిష్టకు విఘాతం కలిగించే అంశమేనని అభిప్రాయపడ్డారు.
"ప్రతిపక్షం లేని అసెంబ్లీ ప్రత్యర్థి లేని యుద్ధ రంగం" లా ఉందని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా తొలి రోజు సభకు 74 మంది సభ్యులు మాత్రమే రావడంపై ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తంచేశారు. చివరకు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా "ప్రతిపక్షంలేని సభలో నిద్ర వస్తోందని" వ్యాఖ్యానించారు. మొత్తం మీద ప్రతిపక్షం లేని "ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు ఆ సభాపతి" గౌరవాన్ని ప్రాధాన్యతను నేలమీదికి తేవటం తధ్యం. సభలో విపక్షానికి జరిగిన జరుగుతున్న పరాభవాన్ని ప్రజాక్షేత్రం నిశ్శబ్ధంగా గుర్తిస్తుంది. కులధౌష్ట్యం పరాకాష్ఠకు చేరగా, ప్రజాధనాన్ని దుర్వినియోగ పరచటం కూడా ఒక స్థాయి దాటి చెలియలికట్టని చేధించుకొని బయటకు రావటం కూడా ప్రజల్లో ఆందోళన కలవరపాటు కలిగించటం తెలుస్తుంది.
అంతేకాదు జగన్ మోహన్ రెడ్డి చేసే పాదయాత్ర ద్వారా "సర్వం కోల్పోయి రాజ్యభ్రష్టులైన పాండవులు అరణ్యవాసనికి బయలుదేరిన సంఘటన" ప్రజలకు కనిపిస్తూనే ఉంది జనానికి "దుర్యోధనుడు పాండవుల సర్వసంపదలు గుంజుకున్నట్లు వైసిపి ప్రజా ప్రతినిధులను గోడదూకించి తనపార్టీలో చేర్చుకోవటం - గమనిస్తే శల్యుణ్ణి ప్రలోభం తో, కర్ణుణ్ణి రాజ్యం ఆశ చూపి తన అంగబలంలో చేర్చున్న తీరు హర్షనీయమా?
ఈ ప్రజాప్రతినిధులని ప్రజలు ఒక పార్టీ పతాకం క్రింద గెలిపించి విధానసభకు పంపితే వారు అధికార పార్టీ ప్రలోభానికి గురై ప్రజలు ఇచ్చిన మాండేట్ ను నిర్వీర్యం చేయటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక సభ్యుడు ప్రజల నుంచి విపక్షానికి ఎంపికైతే ఆ "మాండేట్ కాలమంతా" ఆ సభ్యుడు విపక్షంలోనే నైతికగా కొనసాగాల్సిన రాజ్యాంగ మౌలిక విధిని మరచిపోవటం అవినీతి కాదా! అలాగే ఒక విపక్ష సభ్యుని బెదిరించో అదిలించో, ప్రలొభపెట్టో, తమ అధికార పార్టీలోకి లాక్కోవటం అనైతికం కాదా! ప్రజలు చూస్తున్నారని అధికారపక్షం గుర్తిస్తే మంచిది అని ప్రజలు గణనీయంగా మాట్లాడుతున్నారు.