తెలంగాణలో మరో ఉద్యమ పార్టీ పురుడుపోసుకునే ఛాయలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన జేఏసీ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో జేఏసీ కూడా వేగం పెంచింది. దీనిలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో అమరవీరుల యాత్రపేరుతో అన్ని పనులు పనిలో పనిగా చక్కబెట్టేసుకుంటున్నారు. తమతో కలిసివచ్చే రాజకీయ పార్టీలతో కలసి బలమైన శక్తిగా ఎదగాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు.
అమరవీరుల యాత్ర పేరుతో చాపకింద నీరులా తెలంగాణాలో రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్న ప్రొఫెసర్ కోదండరాం ఈ నెల 30న కొలువుల కోట్లాట సభకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సభ నిర్వహణకు కావాల్సిన అనుమతులపై కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో.. కోర్టు ఆదేశాల ప్రకారమే సభ జరుపుతామని కోదండరామ్ చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి టి. జేఏసీ ఓ కొత్త రాజకీయ పార్టీగా మారుతుందనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
దీనిపై కోదండరామ్ ఇప్పటివరకు సూటిగా ఎక్కడా స్పందించలేదు. కానీ,ఆయన మాటలు, వ్యవహారాలు చూస్తుంటే రాజకీయ పార్టీ ఏర్పాటుపై త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించేలా వ్యవహారం కనిపిస్తోంది. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఒత్తిడి జేఏసీ శ్రేణుల నుంచీ తీవ్రంగానే ఒత్తిడి ఉంది. దీనికి అనుగుణంగా త్వరలోనే ఆయన నిర్ణయం ఉంటుందని జేఏసీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే, జేఏసీ పార్టీగా మారితే కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ముఖచిత్రంలో కొన్ని మార్పులూ చేర్పులూ చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే తలపడే పరిస్థితి కనిపిస్తోంది. భాజపా, టీడీపీలు కలిసి ముందుకు సాగే అవకాశం తక్కువే. విడివిడిగా ఎవరిదారి వారు చూసుకున్నా ఏ ఒక్క పార్టీకీ సొంతంగా నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా అవతరించేంత ప్రజాదరణ ప్రస్తుతానికి అయితే కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా కొత్త పార్టీకి అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
కోదండరామ్ ఇటీవల కాలంలో లోకల్ ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తున్నారు. తాజాగా మెట్రో రైల్ ప్రాజెక్టులోనూ స్థానికులకే అవకాశం ఇవ్వాలని కోదండరామ్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికీ సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. దాదాపు ఐదు జిల్లాల్లో వారు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ జెఏసితో కలిసి వచ్చే అవకాశం కూడా తక్కువగానే ఉంది. అయితే ఏ పార్టీతో పొత్తులేకుండా మాత్రం జేఏసీ ఒంటరిగా ఎన్నికలబరిలో దిగే సాహసం మాత్రం చెయ్యదు. జేఏసీ పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే కానీ సమీకరణాలు మారే పరిస్థితి కనిపించడంలేదు.