ప్రకృతికి కోపం వస్తే..ఎంత ప్రళయం సంబవిస్తుందో ఇప్పటి వరకు ఎన్నో సంఘటనల్లో రుజువు అయ్యాయి. ఆ మద్య నేపాల్ లో వచ్చిన భూకంప ప్రభావం ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు. తాజాగా ఇరాన్-ఇరాక్ లలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ భూకంప కేంద్రం రెండు దేశాల సరిహద్దుల్లోని హలాబ్జాలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రతకు వంద మందికి పైగా మృతి చెందగా, వేలాది మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి, సహాయక చర్యలు ప్రారంభించారు.
శిథిలాలకింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. మరోవైపు, భూకంపం ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు భవంతులు, లిఫ్ట్ లకు దూరంగా ఉండాలని ఇరాక్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఇరాకీ స్టేట్ టీవీ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది.