ముందుగా అనుకున్నారో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలీదు గాని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మీడియా చానల్స్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మొన్నటివరకూ ఎటు కావాలంటే అటు.. ఆ వార్తలు ఈ వార్తలు చూపించిన వారికి.. ఇప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు ఇవ్వాలా ? అనే సంకట స్థితిలో పడిపోయారట. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలాంటి స్థితి ఎదురవలేదని కొందరు గుర్తు చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం తెలివిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది! ఇంతకీ తెలుగు చానల్స్కు వచ్చిన ఇబ్బందేంటంటారా.. అసెంబ్లీ సమావేశాల కవరేజ్!
అవును, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీవీ ఛానళ్లకు అసెంబ్లీ సమావేశాలు సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. అన్నింటి కంటే ముందు పెద్ద గందరగోళంలో పడేశాయి. అసలే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. అక్కడి వార్తలు.. ఇక్కడి వార్తలు ఎలా కవర్ చేయాలో తెలియక సతమతమవుతుంటే ఇప్పుడు మరో చిక్కు ప్రశ్న వీటి ముందుంచాయి. గతంలో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల తర్వాత.. మరో రాష్ట్రంలో సమావేశాలు జరిగేవి. కానీ ఇప్పుడు ఒకేసారి జరుగుతుండటం.. అందులోనూ ఏపీలో ప్రతిపక్షం లేకుండా కేవలం ప్రభుత్వ సభ్యులే ఉండటం వీరి కన్ఫ్యూజన్కు కారణమట. నిత్యం వార్తలు అందించే 24 గంటల టీవీ ఛానళ్లు తరచూ తీవ్ర అయోమయానికి గురయ్యే పరిస్థితి.
లైవ్ లో ఏ సభ వ్యవహారాలు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో విపక్ష నేత పాదయాత్రలో బిజీగా ఉన్న నేపథ్యంలో.. ఏపీ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలకు తావు లేదు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా సుదీర్ఘకాలం సాగే సమావేశాలు కావటంతో ఏదైనా అంశంపై నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో విపక్షాలు ఉన్నాయి. బలమైన అధికారపక్షం.. దేనికైనా రెఢీ అనటం.. తేడా వస్తే తప్పును అంగీకరించి..ఆ ఇష్యూను ఫటాపట్ అంటూ తేల్చేసే కేసీఆర్ కారణంగా తెలంగాణ అసెంబ్లీ సైతం అంత హాట్ హాట్ గా సాగుతున్నదేమీ లేదు. దీంతో.. ఏ అసెంబ్లీ సమావేశాన్ని ఛానళ్లలో ఎక్కువగా చూపించాలన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
కొన్ని మీడియా సంస్థలకు ఏపీ.. తెలంగాణలో వేర్వేరు ఛానళ్లు ఉన్నప్పటికీ..చాలామందికి ఈ పరిస్థితి లేదు. సింగిల్ ఛానళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పేరుకు ఒకటే ఛానల్ ఉంటే ఏ టైంలో ఏ అసెంబ్లీ సమావేశాలకు పెద్ద పీట వేయాలన్నది అయోమయానికి గురి చేస్తోంది. కొంతలో కొంత మెరుగైన విషయం ఏమిటంటే.. ఏపీ విపక్ష నేత నిర్వహిస్తున్న పాదయాత్ర కారణంగా టీవీ ఛానళ్లు కాస్తంత ప్రశాంతంగా ఉన్నాయి. ఇంచుమించు ఒకే టైంలో జరిగే అసెంబ్లీని కవర్ చేయటం ఛానళ్లకు కఠిన పరీక్షేనని చెప్పక తప్పదు. మరి దీనిని ఎలా ఎదుర్కొంటాయో వేచిచూడాల్సిందే!!