ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి కేబినెట్ ప్రక్షాళనకు రెడీ అవుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ యేడాది ఆరంభంలో తన కేబినెట్లో భారీగా మార్పులు, చేర్పులు చేసిన చంద్రబాబు ఈ యేడాది చివర్లో మరోసారి ఈ ప్రక్షాళనకు రెడీ అవుతోన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇంకా గట్టిగా యేడాది కూడా టైం లేదు. ముందస్తు ఎన్నికలు వస్తే 2018 నవంబర్లోనే ఎన్నికలు ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ వాణి బలంగా వినిపించే వాళ్ళు క్యాబినెట్లో ఉండాలని బాబు భావిస్తున్నారు.
డిసెంబర్లో జరిగే తాజా ప్రక్షాళనలో బాబుకు రైట్ హ్యాండ్గా ఉన్న ఓ సీనియర్ మంత్రిని తప్పించడం ఖాయమన్న ప్రచారం అమరావతిలో జరుగుతోంది. సదరు సీనియర్ మంత్రి ఎవరో కాదు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. ఇటీవల కీలకమైన ఆర్థికశాఖకు మంత్రిగా ఉన్న చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల టైంలోను, అసెంబ్లీలో తన శాఖ విషయంలోను నిర్లప్తతో ఉండడంతో బాబు అసంతృప్తితో ఉంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. యనమలను మంత్రివర్గం నుంచి తప్పించి ఆయన్ను రాజ్యసభకు పంపడం దాదాపు ఖాయమైందని టాక్.
ఇక యనమలకు బదులుగా పార్టీలో ఫైర్బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తికి కేబినెట్లో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే తరచూ వివాదాలకు దగ్గరగా ఉంటారని పేరున్నా పార్టీకోసం ఆయన అంకితభావంతో పనిచేయడం, ఆయన వల్ల జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందన్న భావనతో ఉన్న బాబు ఆయనకు చోటు ఇచ్చే అంశంపై ఆలోచన చేస్తున్నారట. ఇక ఈ యేడాది ప్రక్షాళనలో చోటు దక్కించుకున్నవారిలో సీమ జిల్లాలకు చెందిన ఓ జూనియర్ మంత్రితో పాటు గోదావరి జిల్లాలకు చెందిన ఓ మంత్రి పనితీరుపై బాబు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వచ్చే క్యాబినెట్ లో బెర్త్ దొరకవచ్చని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేకు లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదమైనా తాజా ప్రక్షాళనలో చంద్రబాబు భారీస్థాయిలో ప్రక్షాళన చేయకపోయినా రెండు మూడు బెర్త్లను మార్చి కొత్తవారికి చోటు కల్పించవచ్చని టాక్. 2019 ఎన్నికల దృష్టితో చేస్తున్న ఈ మార్పుల నుంచి చంద్రబాబు భారీగా రాజకీయ ప్రయోజనం ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.