ఇరాన్ లో సంభవించిన పెను భూకంపం వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. శిథిలాలు తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్–ఇరాన్ సరిహద్దుల్లో భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 450 మంది మరణించగా 8000 మంది గాయపడ్డారు. మరో పాతిక వేల మంది ఇంటిని, బంధువులను కోల్పోయారు.
రాత్రివేళ కావడంతో చాలా మంది తప్పించుకునే వీల్లేక శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో జర్గోస్ పర్వతాల మధ్య ఉన్న సర్పోలే జహాబ్ పట్టణం(ఇరాన్) భూకంపం తీవ్రతకు బాగా దెబ్బతింది. జహాబ్లో విద్యుత్తు, నీటి సరఫరా వ్యవస్థలు పూర్తిగా నాశనం కాగా.. టెలిఫోన్, సెల్ఫోన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇరాక్లోని కుర్దూ ప్రాంతంలోనూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు… 300 మంది గాయపడ్డారు.
ఇరాక్లోని హలబ్జా పట్టణానికి 31 కిలోమీటర్ల తూర్పు దిక్కుగా… ఇరాన్, ఇరాక్ సరిహద్దులో ఉన్న జాగ్రోస్ పర్వత ప్రాంతంలో 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూపరిశోధనా సంస్థ ప్రకటించింది.
ఈ ప్రాంతంలో అంతంత మాత్రంగా ఉన్న విద్యుత్, కమ్యూనికేషన్, ఇతర మౌలిక సదుపాయాలు సైతం తీవ్రంగా దెబ్బతినడంలో ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కాలం వెళ్లదీశారు. ఇళ్లు కూలిపోయి… కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపించారు.