అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి.. పెట్టుబడులు రావాలి. ఉపాధి అవకాశాలు పెరగాలి. మరి ఇవన్నీ జరగాలంటే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వంపై నమ్మకం ఉండాలి. కానీ ప్రభుత్వ నిబంధనలు చాలావరకూ వారిని ఇబ్బందిపెట్టేలాగానే ఉంటాయి. ఓ పరిశ్రమ పెట్టాలంటే సవాలక్ష రూల్స్ ఉంటాయి. అందుకే ఏపీ సర్కారు ఆ అడ్డంకులు తొలగించేందుకు నడుంబిగించింది. పారిశ్రామీకరణకు మరింత ఊతమిచ్చేందుకు నాలా పన్ను తగ్గించే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది.
చట్ట సవరణ ద్వారా నాలా పన్ను ప్రస్తుతం ఉన్న 9శాతం నుంచి 3శాతానికి తగ్గించింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించు కోవాలంటే భూ వినియోగ మార్పిడి చేసుకోవాలి. దీనికి విధించే నాలా పన్ను ప్రస్తుతం రాష్ట్రంలో 9శాతం ఉంది.పెట్టుబడిదారులకు తక్కువ ధరకే భూములు ఇచ్చి రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు దీనిని గణనీయంగా తగ్గించాలని సర్కారు నిర్ణయించింది.
నాలా పన్ను తగ్గించడమే కాదు.. ఈ నాలా పన్నును ఇకపై ఆన్ లైన్ లోనే చెల్లించేలా చట్ట సవరణ చేశారు. ఇందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఒక సింగిల్ విండో పద్దతిని ఏర్పాటు చేశారు. ఆ జిల్లాకు సంబంధించిన ప్రతి దరఖాస్తు అక్కడికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా 21రోజుల్లో భూమి వినియోగ మార్పిడికి అనుమతులు లభిస్తాయి.