కొన్ని పొరపాట్లు చేయడం.. వాటిని సరిజేసుకోకపోవడం! కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం.. వాటి ద్వారా ఎదురు దెబ్బలు తగిలినా తన పంథా మార్చుకోకపోవడం.. ఇదీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యవహార శైలి! ఇప్పుడిప్పుడే ఆయన సరైన ట్రాక్లో పడుతున్నారని భావించేలోగానే.. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మరోసారి పార్టీలో చర్చనీయాంశ మైంది. క్లాస్ నాయకుల వెంటపడుతూ.. మాస్ నాయకులను దూరం పెట్టడం జగన్కు మరోసారి ఇబ్బందులు తెచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు!! క్లాస్ నాయకులను తన చుట్టూ పెట్టుకుని.. ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న వారిని సైలెంట్గా ఉంచడం సరికాదనే చర్చ మొదలైంది. కీలకమైన దశలో క్లాస్ కంటే మాస్ నాయకులే పార్టీకి అవసరమని, వీరి వల్ల పార్టీకి మైలేజ్ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రజాసంకల్ప యాత్ర పేరుతో.. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఎన్నికలకు ఇప్పటి నుంచి బరిలోకి దిగిపోయారు. ఇదే సమయంలో ఆయన అనుసరిస్తున్న పంథా వివాదాస్పదం అవుతోంది. జనాల్లోకి వెళ్లే క్రమంలో జగన్.. మాస్ లీడర్లను నమ్ముకోకుండా క్లాస్ లీడర్లను నమ్ముకుంటున్నారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిని చేరదీసి.. వారికి రాజకీయ పదవులు కట్టబెట్టారు. అదేసమయంలో రాష్ట్రస్థాయిలో బాధ్యతలు అప్పగించా రు. వీరు వైసీపీకి కీలకంగా మారిపోయారు. ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజాను ప్రోత్సహించాల్సిన సమయంలో వీరిద్దరూ వారి నోళ్లు నొక్కేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రోజా, చెవిరెడ్డి ఒకానొక సందర్భంలో గీత దాటిన సంగతి వాస్తవమే అయినా.. హెచ్చరికలతో సరిపెడితే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఇక మాట్లాడొద్దని చెవిరెడ్డికి లోటస్ పాండ్ నుంచి ఉత్తర్వులు అందాయి. రోజాకు కూడా ఇలానే ఆదేశాలు వెళ్లినా.. ఆమె వెంటనే జగన్ దృష్టికి తెచ్చారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే నాని కూడా ఫైర్ బ్రాండే.. ఆయనపైనా కొన్ని ఆంక్షలు నడుస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాదయాత్ర సాగుతోంది. దీనికి మాస్లో ఫాలోయింగ్ రావాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకంగా పాదయాత్రపై ప్రచారం సాగాల్సి ఉంది. ఇక జనాల్ని మరింతగా పార్టీకి చేరవేయాలంటే.. మాస్ లీడర్లే కీలకం!
పాదయాత్రపై అన్ని జిల్లాల్లోనూ సన్నాహక యాత్రలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వీటిపై జగన్ కానీ, ఆయన పక్కన సాగుతున్న క్లాస్ లీడర్లు కానీ దృష్టి పెట్టలేదు. చంద్రబాబు నిర్వహించిన వస్తున్నా మీకోసం పాదయాత్రను తీసుకుంటే.. దీనికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీ ప్రత్యేకంగా వందేమాతరం శ్రీనివాస్తో పాటలు రాయించుకుని, పాడించుకుని ఊరూరా ప్రచారం చేశారు. ఇలా మాస్ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయకుండా.. ఎంతసేపూ క్లాస్కే పరిమితం అయిపోతే.. పాదయాత్ర ముందుకు ఎలా సాగుతుందనే చర్చ నడుస్తోంది. జగన్ మరో క్లాస్ తప్పిదం చేస్తున్నారని, దీనిని ఎంత త్వరగా గ్రహించి.. సరిజేసుకుంటే అంత మంచిదని చెబుతున్నారు!!