ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలో కప్పదాట్లు ఎక్కువయ్యాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి నాయకులు వరుసపెట్టి జంపింగ్లు చేసేస్తున్నారు. షాక్ ఏంటంటే విపక్ష పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి జంప్ చేయడం కామన్. అయితే ఇప్పుడు తెలంగాణలోను, ఏపీలోను విపక్ష పార్టీల్లోకి కూడా ప్రజాప్రతినిధులు జంప్ చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ నుంచి రేవంత్రెడ్డి అధికార టీఆర్ఎస్లోకి జంప్ చేసేశారు. ఇది తెలంగాణ పాలిటిక్స్లో ఓ కుదుపు కుదిపేసింది. రేవంత్రెడ్డి పార్టీ మార్పు ఇప్పుడు అక్కడ పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఏపీలో విపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఈ లిస్టులో ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఇక ఇప్పుడు రివర్స్లో అధికార టీడీపీకి చెందిన ఓ ఎంపీ టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ సదరు ఎంపీ ఎవరో కాదు సీఎం చంద్రబాబుకు రైట్ హ్యాండ్గా ఉండే చిత్తూరు ఎంపీ శివప్రసాద్. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార టీడీపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి.
పార్టీ నాయకుల మధ్య అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇక చంద్రబాబుకు ఎంతో నమ్మినబంటు అయిన శివప్రసాద్ కొద్ది రోజులుగా బాబు మీదే నిరసన గళం విప్పుతున్నారు. శివప్రసాద్ వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఒకానొక దశలో బాబు శివప్రసాద్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అనుకున్నా స్నేహితుడు కావడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఇటీవల పదే పదే చంద్రబాబును, టీడీపీని ఇబ్బంది పెట్టేలా ఆయన వ్యవహరించారు.
శివప్రసాద్ వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కుప్పం నుంచి వచ్చే మెజార్టీతోనే చిత్తూరు ఎంపీ సీటును టీడీపీ ఎప్పుడూ గెలుచుకుంటోంది. తాజాగా శివప్రసాద్ తాను కుప్పం మెజార్టీతో ఎంపీగా గెలవలేదని, తన భార్య రెడ్డి అయినందును ఆ వర్గం ఓట్లన్ని తనకే పడ్డాయని ఆయన చెపుతున్నారు. ఇక మోడీ సర్కార్ తప్పులను ఆయన పదే పదే ఎత్తి చూపుతున్నారు. జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాబోయేది పార్టీలు మారే సంవత్సరం అని రంగులు మారే సంవత్సరం అని చెప్పారు. అదీ కాకుండా వైసీపీ ఎమ్మెల్యే రోజాతో ఆయన తరచూ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ పరిణామాలన్ని ఆయన పార్టీ మారేముందు కనిపిస్తోన్న సంకేతాలుగా జిల్లాలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో బాబు శివప్రసాద్కు సత్యవేడు అసెంబ్లీ సీటు ఇచ్చారు. అయితే ఆ తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యే సీటు కోరుతున్నా బాబు మాత్రం శివప్రసాద్కు ఎంపీ సీటే ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయన కోరికను పట్టించుకోకపోవడంతో వైసీపీలో చేరి అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.