అరకులోయలో మంగళవారం ప్రారంభమైన హాట్ బెలూన్ ఫెస్టివల్కు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో బుధవారం తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం కారణంగా బెలూన్లు ఎగరడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఫెస్టివల్ను నిలిపివేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలోని 16 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఫెస్టివల్లో పాల్గొని తమ తమ దేశాలకు చెందిన బెలూన్లను తొలిరోజు మంగళవారం ఎగురవేసారు. విశాఖ అరకు టూరిజానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది.
దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ వేడుకకు ఇవాళ సీఎం చంద్రబాబు హాజరు కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఫెస్టివల్లో పాల్గొనడానికి అమెరికా, స్విట్జర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్ వంటి 13 దేశాలకు చెందిన ఔత్సాహికులు హాజరయ్యారు. నిన్న వాతావరణం అనుకూలించక బెలూన్లు ఎగరకపోయినప్పటికీ వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, అరకు ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని వారు అన్నారు.
కొండవాలులో, పొలాల మధ్య పర్యాటకులకు మరువలేని మధురానుభూతులు మిగులుస్తోంది. బాలల దినోత్సవం రోజు ప్రారంభమైన ఈ వేడుకను అరకుతో పాటు చుట్టుకపక్కల ప్రాంతాల వారు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.
అరకు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని దళపతిగూడలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ క్యాంప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో టూరిజంను ప్రమోట్ చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని స్థానికులు చెబుతున్నారు.