ఏపీ సీఎం చంద్రబాబు జమానా అంటే అవినీతి రహితమని అనుకునేలా ప్రచారం పేట్రేగుతోంది. అనినీతిని సహించను, అవినీతిని భరించను అంటూ చంద్రబాబు చెప్పే డైలాగులు అన్నీ ఇన్నీ కావు. అవినీతి అంతమే తన లక్ష్యమంటూ ఇటీవల ఆయన కామెంట్ కూడా కుమ్మరించారు. అలాంటి బాబు గారి ఏలుబడిలో సాక్షాత్తూ అమాత్య వర్యులే అవినీతితో అంటకాగుతున్నారని తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. పెద్దగా రాజకీయ టచ్లేని ఓ వ్యక్తి.. 2014లో అదృష్టం తలుపు తట్టి అధికార పార్టీ టికెట్ సంపాయించుకున్నాడు. ఇక, ఆయనకు కులం ప్లస్ అయింది . దీంతో ఆయన సునాయాశంగా ఎన్నికల్లో గెలిచేశారు.
గతంలో టీచర్ గిరీతో పాటు, యూనియన్ నేతగా కూడా చక్రం తిప్పిన ఈయనకు మరో అదృష్టం కూడా వరించింది. బాబు ఏరి కోరి ఈయనకు కీలకమైన శాఖ అప్పగించారు. దీంతో ఆయనగారి పంట పండింది. అయిన దానికి, కాని దానికీ కూడా చేయి చాపడం ప్రారంభించాడని ఆ శాఖ అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. అంతే కాదు కులాభిమానం కూడా బాగా చూపిస్తున్నారట. ఇతర కులాల వారు తప్పు చేస్తే వారిపై సస్పెండ్ వేటు వేస్తున్న మంత్రి తన కులం వారు తప్పు చేస్తే మాత్రం వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. సస్పెండ్ చేయకుండానే ఆ అధికారిని ఎలా పోస్టింగ్ ఇవ్వాలా..? అనే దానిపై చర్చిస్తున్నారు.
ప్రతి ఫైల్కు ప్రతిఫలం ఆశిస్తున్నారనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి. చిన్న ఫైల్పై ఆయన సంతకం పడాలన్నా చేయి తడపాల్సిందేనట. ఇది రాజకీయ నాయకులకు కామన్ అయినా, సదరు మంత్రి మాత్రం మరీ చిన్న ఫైల్కు కూడా చేతిలో కాసులు పడందే సంతకం పెట్టడం లేదన్న విమర్శలు అమరావతి సర్కిల్స్లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే సదరు మంత్రి వ్యవహారం సీఎం చంద్రబాబు దాకా వెళ్లిందని సమాచారం.
అయితే చంద్రబాబు ఇతరత్రా పనుల్లో బిజీబిజీగా ఉండడంతో ఈయనను పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, అమరావతి వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. సదరు మంత్రి వర్యులను లూప్ లైన్లో పెట్టారని, వచ్చే ఎన్నికల్లో టికెట్ హుళక్కేనని అంటున్నారు. అంతేకాకుండా.. రేపో మాపో కేబినెట్ను విస్తరించినా.. ఈ మంత్రిగారి పదవి పోయే ప్రమాదం ఎదురు చూస్తోందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.