కేంద్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. 2014లో బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేసి.. గెలుపు గుర్రం ఎక్కాయి. దీంతో ఏపీలో బీజేపీకి రెండు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఇక, కేంద్రంలోను టీడీపీ ఎంపీలకు రెండు మంత్రి పదవులు దక్కాయి. దీంతో ఇరు పార్టీలు, ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం వెల్లివిరిసిందని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా కొన్ని విషయాల్లో తలెత్తిన వివాదాలు చినుకు చినుకు గాలి వానగా మారి.. ఏపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది.
విషయంలోకి వెళ్తే.. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో పోలవరం బహుళార్ధక ప్రాజెక్టును కేంద్రంమే నిర్మించాల్సి ఉంది. దీనికి అయ్యే ప్రతి రూపాయినీ కేంద్రం ఇవ్వాల్సి ఉంది. మరోపక్క, రాష్ట్రానికి ప్రాజెక్టుతో ఉన్న సంబంధం కేవలం భూ సేకరణ చేసి ఇవ్వడమే. అయితే, ఈ విషయంలో చంద్రబాబు కొంత దూకుడు ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి 2019 ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, నిధుల విషయంలో పెద్ద చికాకు వచ్చింది. ఎంత ఖర్చు పెడుతున్నా డబ్బుకు ఇబ్బందులు తప్పలేదు.
దీంతో కేంద్రం మీద ఒత్తిడి పెంచారు. కాంట్రాక్టు సంస్థల విషయంలోనూ చంద్రబాబు వేలు పెట్టారు. దీంతో కేంద్రం.. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అసలు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం విషయంలో ఏపీ కేబినెట్ సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటుందని ఢిల్లీలోని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సీఎంవోలోని అధికారులు కొంత మంది నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని..అదే సమయంలో వారు ఇతర అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు.అయితే, అదే సమయంలో కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై దృష్టి పెట్టడం గమనార్హం.
ఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలు మొదలుకుని… పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టు వ్యవహారాలు.. ఏపీలో సాగుతున్న పరిణామాలపై కేంద్రంలోని ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కేంద్రం ఇస్తున్న నిధులు ఏమైపోతున్నాయి? దేనికోసం ఇస్తే.. దేనికోసం ఖర్చు పెడుతున్నారు? వంటి సందేహాలతో ఏపీ వ్యవహారాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ పరిణామం చంద్రబాబుకు మింగుడు పడని విధంగా తయారైందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.