కర్ణాటకలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా నేతల కప్ప దూకుళ్లు పెరిగిపోయాయి. ఇప్పటికే కొత్త పార్టీ కూడా ఒకటి తెరమీదకి వచ్చింది. దీంతో రాజకీయంగా రాష్ట్రంలో వేడి రాజుకుంది. తాజా విషయానికి వస్తే.. కర్ణాటక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్న మాజీ మంత్రి, నటుడు, అంబరీష్ తన దారి తాను చూసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. అయితే, ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మంత్రి వర్గం నుంచి తప్పించారు. దీనిని అవమానంగా భావించిన సదరు మాజీ హీరోగారు.. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పనున్నారనే టాక్ వినిపిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో ఒకప్పుడు అధికార చక్రం తిప్పిన మాజీ ప్రధాని దేవెగౌడ ఆయన కుమారుడు కుమార స్వామి నేతృత్వలోని జేడీఎస్కు మళ్లీ పునర్ వైభవం వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారం అంచుల వరకు ఈ పార్టీ చేరుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. సరైన నేతలు లేకపోవడంతో కొంత డౌట్గానే ఉంది. ఈ నేపథ్యంలో కుమార స్వామి యువతకు ప్రాధాన్యం పెంచారు, ప్రజలకు అనేక హామీలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
గత కొన్నాళ్లుగా సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అంబరీష్ జేడీఎస్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావిస్తున్న జేడీఎస్ వచ్చిన వారిని వచ్చినట్టు తన పంచన చేర్చుకునేందుకు రెడీ అయింది. దీంతో అంబరీష్.. రాకను కుమార స్వామి స్వాగతిస్తున్నారని, పదవుల విషయంలోనే చర్చలు నడుస్తున్నాయని తాజా సమాచారం. ఇది ఒకటి లేదా రెండు రోజుల్లో ఖరారు అవుతుందని దీంతో అంబరీష్ తన భార్య మాజీ హీరోయిన్ సుమలతతో కలిసి దేవెగౌడ చెంతకు చేరతారని తెలుస్తోంది.
అంబరీష్ ప్రస్తుతం కర్ణాటకలోకి మండ్య జిల్లా కేంద్రం నుంచి అసెంబ్లీకి ప్రాథినిత్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ మారినా జేడీఎస్ నుంచి అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక హీరోయిన్ రమ్య ప్రస్తుతం కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. రమ్యకు అంబరీష్కు రాజకీయంగా వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అంబరీష్ను మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అవమానంగా భావించి, ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారని తెలుస్తోంది. సో... త్వరలోనే కర్ణాటకలో మార్పులు తథ్యం అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి.