తెలంగాణలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు తల్లికూతుళ్లు కలిసి ఎర్త్ పెడుతున్నారా ? మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ గల్లంతవుతుందా ? శంకర్ నాయక్ కు టిఆర్ఎస్ టికెట్ రాకపోతే పార్టీలో ఉంటారా ? ఉండరా ? ప్రస్తుతం వరంగల్ రాజకీయాల్లో ఈ అంశాలపై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తాజా వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలయ్యింది. రెడ్యా నాయక్ కుమార్తె మాజీ ఎమ్మెల్యే కవిత ప్రస్తుతం మహబూబాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడానికి ఆమె ఇప్పటి నుంచే పావులు కదుపుతోందన్న వార్తలు జోరుగా స్ప్రెడ్ అవుతున్నాయి.
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత.. తండ్రి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో పాటే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తన సొంత కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ వస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్నాయక్కు పోటాపోటీగా నియోజకవర్గంలో కార్యకర్తలు, అనుచరులను కలుస్తోంది. తాజాగా 'నాకు.. నా బిడ్డకు టికెట్లు' అంటూ రెడ్యానాయక్ వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఆమె ఎసరు పెట్టారా? అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.
మహబూబాబాద్ రాజకీయం కూడా డోర్నకల్ తరహాలోనే సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన రెడ్యా నాయక్ కుమార్తె, మాజీ ఎమ్మెల్యే కవిత.. టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ పై ఓటమి పాలయ్యారు. కానీ ఆ తర్వాత ఆమె కూడా టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. సీఎం కేసీఆర్ ఆమెకు రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఇక శంకర్నాయక్కు ఇటీవల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత పెరగడం, కలెక్టర్ మీనాతో ఆయన వ్యవహరించిన తీరుతో సీఎం కేసీఆర్ సైతం ఆయనకు వార్నింగ్ ఇవ్వడంతో ఆయనకు పెద్ద మైనస్గా మారింది.
ఇక ఈ పరిణామాలన్ని గమనిస్తోన్న మాజీ ఎమ్మెల్యే కవిత తన తండ్రి రెడ్యానాయక్ సాయంతో మహబూబాబాద్లో దూసుకుపోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్ను తప్పించి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాపకిందనీరులా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్యా కూడా వచ్చే ఎన్నికల్లో తనకు, తన కుమార్తెకు రెండు సీట్లు అని చెప్పడం చూస్తుంటే మహబూబాబాద్ రాజకీయం ఎలా మలుపులు తిరుగుతోందో ? ఎవ్వరికి అర్థం కావడం లేదు. మరో వైపు శంకర్ నాయక్తో పాటు ఆయన అనుచరులు మాత్రం వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ తమదే అని, తామే గెలుస్తామని చెపుతున్నారు.