వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నేత జగన్.. తీసుకున్న/ తీసుకుంటున్న నిర్ణయాలు పెను సంచలనాలకు దారితీస్తున్నాయి. హోదా విషయం నుంచి ఇప్పుడు అసెంబ్లీ బాయ్కాట్ విషయం వరకు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పెను రికార్డుగా మారుతోంది. తాజాగా ఆయన ఈ నెల 6 నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు 3000 కిలోమీటర్ల దూరాన్ని పాదయాత్రగా వెళ్లి ప్రజలను పలకరించివారి సందేహాలు, సమస్యలు తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో తన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వాటిని పరిష్కరించే దిశగా జగన్ ఈ పాదయాత్రను ప్రిపేర్ చేశారు.
ఇదిలావుంటే, ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 10 నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, జగన్ మాత్రం.. బాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి ఆకర్ష్ మంత్రంతో తన పార్టీలోకి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడమో.. లేదా వారిపై వేటు వేయడమో ఏదో ఒకటి చేయాలని .,. అప్పటి వరకు తాను కానీ, తన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. దీంతో రాష్ట్రంలో సంచలనం ఏర్పడింది. ప్రభుత్వం కూడా మొదట్లో కొంత డిఫెన్స్లో పడింది. సాక్షాత్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం వైసీపీకి విజ్ఞప్తి చేశారు.
ఇది మంచి వేదిక అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన వైసీపీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా వైసీపీ నేతలు కానీ, జగన్ కానీ దీనిపై స్పందించలేదు. పోనీ అసెంబ్లీకి వెళ్తున్నారా ? అంటే వెళ్లడమూ లేదు. మరోపక్క, అసెంబ్లీలో అంటే ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. బాయ్కాట్ చేశారు. కొంతమేరకు రీజన్ కనిపిస్తోంది. అయితే, మండలికి ఏమైంది? ఏపీ శాసన మండలి సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్సీలు బాయ్కాట్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలకు ఒక్కరు కూడా హాజరుకాలేదు. దీంతో ఎమ్మెల్సీలు రాకపోవడంపైనా సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
ఈ క్రమంలోనే దృష్టి పెట్టిన వారికి జగన్ వ్యూహం ఇప్పుడు అర్ధమైంది. ఆయన అసెంబ్లీని ఎందుకు బాయ్కాట్ చేశారో ? ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్లడం లేదో ఇప్పుడు తెలిసిపోయింది. ఈ మొత్తానికి కారణం జగన్ పాదయాత్ర!! ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జగన్ వ్యూహం. తన పాదయాత్రను విజయవంతం చేసుకునేందుకు, తన పాదయాత్ర ఏర్పాట్లు, జనసమీకరణకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండేందుకు జగన్ తీసిన అస్త్రమే ఈ బాయ్కాట్. నిజానికి గత అసెంబ్లీ సమావేశాల సమయానికే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు క్యూకట్టి టీడీపీలోకి చేరిపోయారు. మరి అప్పట్లో జగన్కు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇదే ఆయన పాదయాత్ర వ్యూహం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. సభలకు వెళ్లిపోతే.. పాదయాత్రకు జన సమీకరణ ఎక్కడ నుంచి జరుగుతుంది? ఎవరు దీనిని సక్సెస్ చేస్తారు? ఎవరు ఈ ఖర్చులు భరిస్తారు? అందుకే బాయ్కాట్ బాణం ప్రయోగించారు జగన్!! ఇదీ జగన్ వ్యూహం.