తెలంగాణాలో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ఏ నేత ఏ పార్టీలో ఉంటాడో ? తెలియని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటోన్న కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలతో మొదటి నుంచి వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీకి వెళ్లడం శ్రేయస్కరమని సోదరులు భావిస్తున్నారు.
కానీ తెలంగాణాలో ఇప్పటికిప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగా సరిపెట్టుకోవాలా ? అన్న ఆలోచనలో వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మార్పు ప్రచారం వారి రాజకీయ స్థిరత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న బ్రదర్స్ ప్రస్తుతం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే విషయంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీని మొదటి నుంచి వ్యతిరేకించిన నేతల్లో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారు. పార్టీ అధిష్టానాన్ని కలిసి, ఆయన చేరికపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఇదే అంశమై అసెంబ్లీ లాబీల్లో ఓ ప్రముఖ బీజేపీ నేత ఆఫ్ ద రికార్డ్ గా మిత్రుల దగ్గర మాట్లాడారని సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్ కి వేరే ఆప్షన్ లేదనీ, వారు కచ్చితంగా బీజేపీ వైపు రావాల్సిందే అంటూ ఆయన అభిప్రాయపడ్డారట.
ఓ సందర్భంలో కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్లో చేరిపోతున్నట్టు కూడా వార్తలొచ్చాయి. చివరి నిమిషంలో మళ్లీ వెనక్కి తగ్గారు. ఇలా రెండుసార్లు జరిగింది. పార్టీ మార్పుపై వీరు గందరగోళ పడుతున్న సమయంలోనే టీఆర్ఎస్ మరో ప్రత్యామ్నాయ నేతను వెతుక్కుంది. దీంతో కోమటిరెడ్డి పార్టీలోకి రాకపోయినా ఫర్వాలేదన్నట్టుగా టీఆర్ఎస్ వ్యవహార శైలి మారింది. కేసీఆర్ సైతం ఇప్పుడు వీరిని పార్టీలో చేర్చుకునేందుకు అంత ఇంట్రస్టింగ్గా లేరని తెలుస్తోంది. దీంతో కోమటి రెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా పార్టీ మారాల్సి వస్తే బీజేపీ తప్ప వారికీ మరో ప్రత్యామ్న్యాయం కనిపించడంలేదు.