రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం! ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎదుర్కొంటున్నారు. 2014లో వరంగల్ జిల్లా భూపాల పల్లి నుంచి గెలిచిన ఆయనకు సీఎం కేసీఆర్ మంచి పదవి ఇచ్చి గౌరవించారు. తెలంగాణ ఉద్యమం వ్యవస్థాపకుల్లో ఒకరు అయిన ఆయన కేసీఆర్కు ఎంతో ఆప్తమిత్రుడు. సభలోనూ స్పీకర్ అదేవిధంగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి వీరి ప్రయాణం బాగానే సాగుతోందని అనుకుంటున్న సమయంలో సింగరేణి ఎన్నికలు మధుసూదనాచారి రాజకీయ జీవితంపై పెను ప్రభావం చూపించేలా మారిపోయాయి.
విషయంలోకి వెళ్తే.. భూపాల పల్లి పరిధిలో.. సింగరేణి ఎన్నికలు జరిగాయి. ఇవి కార్మిక సంఘాల ఎన్నికలే అయినా. ప్రభుత్వం, ప్రతిపక్షాలు సవాలుగా తీసుకున్నాయి. మూడున్నరేళ్ల కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనకు ఇవి అద్దం పడతాయని విపక్షాలు ప్రచారం చేశారు. అయితే, కేసీఆర్ ఏకంగా తన కుమార్తెను రంగంలోకి దింపి ఇక్కడ విజయం సాధించారు. అయితే, గణపురం మత్స్యసొసైటీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. అదేవిధంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భూపాలపల్లి డివిజన్లో ఓడిపోయింది. ఈ డివిజన్ స్పీకర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. అయితే, పార్టీ గెలుపునకు స్పీకర్ ప్రయత్నించలేదని కేసీఆర్ దృష్టికి ఫిర్యాదులు వెళ్లాయి.
అదే సమయంలో మధుసూదనాచారి కుమారులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని దందాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఇక, మధుసూదనాచారిని కొనసాగించి ప్రయోజనం లేదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు మధుసూదనాచారి సీటుపై కన్నేయని నేతలు.. ఇప్పడు ఈ మూడు విషయాలను పట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఆ టికెట్ తమకే కేటాయించేలా కేసీఆర్పై ఒత్తిడి పెంచుతున్నారట. గత ఎన్నికల్లో మధుసూదనాచారి గెలుపునకు కృషి చేసిన కొండా మురళి ఈ సీటును తనకు కేటాయించాలని కోరుతున్నారట. ఒకవేళ అలా కుదరకపోతే.. తన కుమార్తెకు ఇవ్వాలని అడుతున్నారట.
అదేవిధంగా ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ ఎస్లోకి వచ్చిన నేత గండ్ర సత్యనారాయణరావు కూడా ఈ టికెట్పైనే ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు, తనకు ఈ టికెట్ ఇస్తానంటేనే కండువా కప్పుకొన్నానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇక, టీఆర్ ఎస్ మరోనేత నాగుర్ల వెంకన్న కూడా ఈ టికెట్పై కన్నేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ ఎవరికి భూపాలపల్లి టికెట్ ఇస్తారో చూడాలి. ఏదేమైనా కేసీఆర్ బెస్ట్ ఫ్రెండ్గా గుర్తింపు సాధించిన మధుసూదనాచారికి స్వయంకృతం వెంటాడుతోందని అంటున్నారు సన్నిహితులు. ఇక, ఈయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మండలికి పంపుతారనే ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.