ఏపీలో అధికార టీడీపీలోకి ఇప్పట్లో వలసలు ఆగే పరిస్థితి లేదు. వైసీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తూ కర్నూలు జిల్లాలో టీడీపీలో పేరున్న లీడర్లను తన పార్టీలో చేర్చుకుంటుంటే ఇటు జగన్కు రైట్ హ్యాండ్గా ఉన్నవాళ్లు జగన్కు దిమ్మతిరిగే షాక్ ఇస్తూ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనకు యూజ్ అవుతారనుకున్న వారందరికి ఏపీ సీఎం చంద్రబాబు రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారు. ఈ లిస్టులో ఉన్నవారిలో ఇప్పటికే చాలా మంది టీడీపీలోకి వెళ్లిపోగా మిగిలిన వారు కూడా రేపో మాపో సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక వైసీపీలో ఇప్పటికే చాలా వికెట్లు పడగా తాజా వికెట్ జగన్ రైట్ హ్యాండ్దే కాబోతుంది. గత రెండు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ వెంటే నడుస్తోన్న ఆ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జగన్పై తీవ్ర అసంతృప్తితో టీడీపీలో చేరనుంది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కలవడం అనంత రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. జగన్కు రైట్ హ్యాండ్గా ఉన్న గురునాథరెడ్డి 2012లో జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ఉప ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. గత సాధారణ ఎన్నికల్లో గురునాథరెడ్డి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడిపోయారు.
కొద్ది కాలంగా గురునాథరెడ్డి రాజకీయంగా స్తబ్దుగా ఉంటున్నారు. జగన్తో గ్యాప్ రావడంతోనే ఆయన పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇక జగన్ తాజాగా గురునాథరెడ్డికి చెప్పకుండానే ఆయన్ను నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి మైనార్టీ నేత నదీమ్కు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి గురునాథరెడ్డి జగన్పై రగిలిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ సమావేశం జరుగుతుండగానే గురునాథరెడ్డి అనుచరులు నానా రచ్చ రచ్చ చేశారు.
ఇక తాజాగా గురునాథరెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. బాబు కూడా ఆయన ఫ్యామిలీ టీడీపీలో చేరేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే అనంతపురం ఎంపీ గురునాథరెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరికి అస్సలు పొసగడం లేదు. జేసీని ప్రభాకర్చౌదరి అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ చౌదరిని టార్గెట్ చేసేందుకు జేసీ గురునాథరెడ్డిని పట్టుబట్టి మరీ టీడీపీలోకి తీసుకువస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
గురునాథరెడ్డి టీడీపీ ఎంట్రీతో కమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన ప్రభాకర్ చౌదరికి కాస్త టెన్షన్ పట్టుకుందని అనంత టాక్. అయితే బాగా పనిచేస్తోన్న ప్రభాకర్ చౌదరిని బాబు తప్పించరని, ఒకవేళ గురునాథరెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల్సి వస్తే ఆయనకు జిల్లాలోని మరో నియోజకవర్గంలో టిక్కెట్ ఇస్తారని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇక జేసీ తనయుల టిక్కెట్ల కోసమే ఫైటింగ్ జరుగుతోన్న టైంలో గురునాథరెడ్డికి టిక్కెట్ రావడం కష్టంగానే కనిపిస్తోంది.