నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్.జి.టి) లో సుదీర్ఘ కాలంపాటు వాదనలు కొనసాగాయి. రైతుల ఇంట బంగారు సిరులు నింపే భూములను రాజధాని పేరు చెప్పి టీడీపీ సర్కారు బలవంతంగా లాగేసుకుందని అదే సమయంలో ఏమాత్రం పర్యావరణ ప్రమాణాలు పాటించకుండానే అమరావతి నిర్మాణానికి చంద్రబాబు సర్కారు యత్నాలు చేస్తోందని పలువురు వ్యక్తులు వేర్వేరుగా ఎన్.జి.టి ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పిటీషన్లకు ఆద్యుడిగా నిలిచింది శ్రీమన్నారాయణ అనే చెప్పాలి. సామాజిక ఉద్యమకారుడిగా రంగంలోకి దిగిన శ్రీమన్నారాయణ, అమరావతి నిర్మాణంపై చంద్రబాబు సర్కారు తనదైన ఒంటెత్తుపోకడలు పోతోందని ఆరోపించి నేరుగా ఎన్.జి.టి. ని ఆశ్రయించి తెలుగుదేశం ప్రభుత్వానికి బలమైన షాకిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఒంటెద్దు పోకడలు ప్రదర్శించే ప్రభుత్వాలను నిలువరించటానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి న్యాయవ్యవస్థ తో పాటు అనేక వ్యవస్థలు ఉన్నా యని దీంతో తెలిసినట్లైంది.
శ్రీమన్నారాయణ నడిచిన మార్గంలో మరి కొందరు కూడా ఇదే విషయంపై ఎన్.జి.టి లో వరుసగా పిటిషన్లు వేయగా, వాటిని కూడా విచారణకు స్వీకరించిన ఎన్.జి.టి విచారణ పూర్తయ్యే దాకా నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత అన్నీపిటిషన్లు ఈ తరహాలోనే ఏకమొత్తం చేసి విచారణ చేపట్టింది. పిటిషనర్ల న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయ వాదులు తమ వాదనలు హోరా హోరీగా వినిపించగా, మొత్తం వాదనలన్నింటినీ సావధానంగా విన్న ఎన్.జి.టి గత రెండు రోజుల క్రితం సంచలనాత్మక తీర్పు వెలువరించారు.
అదేమంటే "ట్రిబ్యూనల్ ఆదేశాలను పాటిస్తూ అమరావతి నిర్మాణం కొనసాగాలని ఆ దిశ గానే అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చల్లటి కబురు చెప్పింది. అదే సమయంలో అమరావతి నిర్మాణంలో పలు సలహాలు సూచనలు కూడా చేసింది. ఆ సూచనలను ప్రభుత్వం తుంగలో తొక్కకుండా అవి అమలవుతున్న విధానాన్ని తెలుసుకునేందుకు రెండు కమిటీలను నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది" అయితే, ఈ తీర్పు విన్న వెంటనే ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇక అమరావతి నిర్మాణాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరని పేర్కొన్నారు.
అయితే అమరావతి నిర్మాణంపై ఎన్.జి.టి. ఇచ్చిన తీర్పు అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఆ తీర్పును నూరు శాతం అమలు చేయక తప్పని పరిస్థితులు ప్రభుత్వానికి ఎదురు కాక తప్పదని కూడా ఈ కేసుకు శ్రీకారం చుట్టిన శ్రీమన్నారాయణ చెబుతున్నారు. తనను పలుకరించిన మీడియా ప్రతినిధులతో విజయవాడలో శ్రీమన్నారాయణ మాట్లాడారు. ఎన్.జి.టి ఇచ్చిన తీర్పుతో పాటు అందు లోని లోతుపాతులను ఈ సందర్భంగా ఆయన కూలం కషంగానే వివరించారు.
*వరద ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్.జి.టి చెప్పిందన్నారు శ్రీమన్నారాయణ. ఈ నిబంధనతోనే రాజధాని ప్రాంతంలో 25వేల ఎకరాల పంటభూము లకు ముప్పు తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేశారు.
*వరద ప్రాంతంలో నిర్మాణాలు వద్దంటే, ఇప్పటి దాకా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలోని చాలా నిర్మాణాల రూపు రేఖలు మారక తప్పదని కూడా ఆయన తెలిపారు.
*ప్రస్తుతం ప్రభుత్వం కట్టిన అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలు కూడా వరద ప్రాంతం లోనే ఉన్నాయని వాటిని తొలగించక తప్పదన్నారు.
*కొండవీటి వాగు ప్రవాహ మార్గాన్ని మార్చరాదని ట్రిబ్యూనల్ ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఎన్.జి.టి. ఆదేశాలను ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తుందన్న విషయాన్ని తాము నిశితంగా గమనిస్తామని ఏమాత్రం ఆదేశాలఅమలు జరగలేదని తమ దృష్టికివచ్చినా వెంటనే మళ్లీ ఎన్.జి.టి ని ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. శ్రీమన్నారాయణ వాదన వింటూ ఉంటే, రాజధాని నిర్మాణంలో "ఏపి ప్రభుత్వం ఇక అమరావతి నిర్మాణాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు" అని పేర్కొన్న విధంగా ముందుకు సాగే పరిస్థితి మాత్రం కనిపించటం లేదు. ప్రభుత్వానికి కడుపులో మంట ఉన్నా, దిక్కుతోచని పరిస్థితుల్లో, తేలుకుట్టిన దొంగలా, మింగలేక కక్కలేక, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు అర్ధమౌతుంది.